Sanjay Kumar: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు

- ఫైర్ డిపార్ట్ మెంట్ డీజీగా ఉన్నప్పుడు సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ కేసు
- విజిలెన్స్ నివేదిక ఆధారంగా సంజయ్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
- సంజయ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకు ముందు అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ కూటమి ప్రభుత్వంలో కేసు నమోదు అయింది. ఈ కేసులో సంజయ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్ ను జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. వాదనల సందర్భంగా సంజయ్ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైర్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా సంజయ్ పై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత నివేదికను ఏసీబీకి పంపించింది. ప్రాథమిక సాక్షాధారాలతో సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.