RCB: సీఎస్కేను దాటేసిన ఆర్సీబీ

- ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఫ్రాంచైజీగా బెంగళూరు
- మొత్తంగా 17.8 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానం
- సీఎస్కేకు 17.7 మిలియన్ల ఫాలోవర్లు
- 16.2 మిలియన్ల ఫాలోవర్లతో మూడోస్థానంలో ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బడా ఫ్రాంచైజీలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు జట్లకు ఉన్నంత డై హార్డ్ ఫ్యాన్స్ మరే ఇతర టీమ్లకు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ రెండు జట్లు ఎక్కడ ఆడినా స్టేడియాలు అభిమానులతో నిండిపోవాల్సిందే. అటు సోషల్ మీడియాలోనూ ఆర్సీబీ, సీఎస్కేకు అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే, ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన చెన్నైను తాజాగా బెంగళూరు అధిగమించింది. మొత్తంగా 17.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో తొలి స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు సీఎస్కే 17.7 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. అటు ముంబయి ఇండియన్స్ (ఎంఐ) 16.2 మిలియన్ల ఫాలోవర్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది.
కాగా, సీఎస్కే, ఎంఐ చెరో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలవగా ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. అయినా ఫాలోయింగ్లో మాత్రం అదరగొడుతోంది. బెంగళూరు 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ చేజార్చుకుంది. అయితే, ఈ సీజన్లో ఆరంభం నుంచే ఆర్సీబీ అదరగొడుతోంది. ఈసారి ఆడిన రెండు మ్యాచ్లలోనూ విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది.