Raja Singh: ఔరంగజేబ్ సమాధిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

- ఔరంగజేబ్ సమాధిని కూల్చివేస్తామన్న రాజాసింగ్
- మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా తెలంగాణ హిందువులు వెళతారని వ్యాఖ్య
- మోదీ అజెండాలో భారత్ ను హిందూ దేశంగా మారుస్తామనే ప్రకటన ఉండాలని విన్నపం
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి అంశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చి వేస్తామని, సముద్రంలో పడేస్తామని ఆయన అన్నారు. అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా తెలంగాణ హిందువులు వెళతారని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబ్, బాబర్ వారసులు ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అజెండాలో భారత్ ను హిందూ దేశంగా మారుస్తామనే ప్రకటన ఉండాలని రాజాసింగ్ కోరారు. వచ్చే ఎన్నికలు హిందూ దేశ భవిష్యత్తు, కాశీ, మథుర అంశాలపై ఆధారపడతాయని చెప్పారు. గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారని... ఎంఐఎం ఆదేశాలతోనే ఇలా జరగిందని మండిపడ్డారు. శోభాయాత్రకు ఈసారి దరఖాస్తు కూడా చేయలేదని చెప్పారు.
ఔరంగజేబ్ సమాధి వివాదంలోకి వెళితే... సమాధిని కూల్చివేయాలంటూ ఇటీవల డిమాండ్లు వినిపించాయి. దీంతో మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వివాదం చాలా సున్నితమైన అంశం కావడంతో... పలు ప్రాంతాల్లో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో అక్కడ చోటుచేసుకున్న ఘర్షణలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కొందరు వ్యక్తులు విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదయింది. నాగపూర్ లో జరిగిన అల్లర్లకు సూత్రధారిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.