Ujjwal Kishor: నోయిడాలో అంతర్జాతీయ పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టురట్టు

- ఉజ్జ్వల్ కిషోర్, నీలు శ్రీవాస్తవ అనే దంపతుల అక్రమ దందా
- రూ. 15.66 కోట్ల అక్రమ విదేశీ నిధులు స్వాధీనం
- ఫేస్బుక్ ద్వారా మోడల్స్ రిక్రూట్మెంట్
- అమ్మాయిలకు నెలకు రూ. 1-2 లక్షల వేతనం
- డుబ్బు ఆశ చూపి వారి ి పోర్న్ చిత్రాల్లో నటింపజేస్తున్న వైనం
నోయిడాలో ఉజ్జ్వల్ కిషోర్, నీలు శ్రీవాస్తవ అనే దంపతులు నిర్వహిస్తున్న ఒక పెద్ద ఆన్లైన్ పోర్నోగ్రఫీ రాకెట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛేదించింది. వీరు విదేశాలకు నిధులు అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రూ. 15.66 కోట్ల అక్రమ విదేశీ నిధులను ఈడీ స్వాధీనం చేసుకుంది. నిందితులు సైప్రస్ కేంద్రంగా పనిచేస్తున్న టెక్నియస్ లిమిటెడ్తో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ సంస్థ ఎక్స్ హామ్స్టర్, స్ట్రిప్చాట్ వంటి ప్రసిద్ధ శృంగార వెబ్సైట్లను నిర్వహిస్తోంది.
బ్యాంక్ లావాదేవీలలో తప్పుడు సమాచారం ద్వారా ప్రకటనలు, మార్కెట్ పరిశోధనల కోసం చెల్లింపులని చూపిస్తూ నిందితులు విదేశీ కంపెనీలకు నిధులను బదిలీ చేశారు. గతంలో ఉజ్జ్వల్ కిషోర్ రష్యాలో కూడా ఇలాంటి రాకెట్లో పాల్గొన్నట్లు ఈడీ విచారణలో తేలింది. ఆ తర్వాత అతను భారతదేశానికి వచ్చి తన భార్యతో కలిసి ఈ కార్యకలాపాలను ప్రారంభించాడు.
ఈ జంట ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించి మోడళ్లను నియమించుకున్నారు. 'echato dot com' పేరుతో ఒక పేజీని సృష్టించి, ఆకర్షణీయమైన జీతాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతానికి చెందిన చాలా మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా ఆకర్షితులయ్యారు. ఆడిషన్ల కోసం నోయిడాలోని వారి ఫ్లాట్కు చేరుకున్న తర్వాత, వారిని పోర్న్ చిత్రాల్లో నటించాలని ప్రతిపాదిస్తారు. నెలకు రూ. 1 నుండి రూ.2 లక్షల వరకు సంపాదన ఉంటుందని ఆశ చూపుతారు.
ఈడీ దాడుల్లో ఈ ఫ్లాట్లో ఒక ప్రొఫెషనల్ వెబ్క్యామ్ స్టూడియోను కనుగొన్నారు. ఇది ఓన్లీఫ్యాన్స్ వంటి అడల్ట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో కంటెంట్ను ప్రసారం చేయడానికి ఉపయోగించే అత్యాధునిక ప్రసార సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. దాడి సమయంలో ముగ్గురు మహిళలు ఆన్లైన్లో కనెక్ట్ అయి పనిచేస్తూ కనిపించారు. వారి వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది.
వినియోగదారులు చేసే చెల్లింపుల ఆధారంగా మోడల్స్ టాస్క్లను చేసేవారు. హాఫ్-ఫేస్ షోలు, ఫుల్-ఫేస్ షోలు, ఫుల్ న్యూడిటీ వంటి వివిధ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు టోకెన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేటగిరీని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఆదాయంలో 75 శాతం దంపతులు ఉంచుకోగా, 25 శాతం మాత్రమే మోడల్స్కు ఇచ్చేవారు.
ప్రారంభంలో వినియోగదారుల నుండి క్రిప్టోకరెన్సీల ద్వారా చెల్లింపులు స్వీకరించేవారు. టెక్నియస్ లిమిటెడ్ ద్వారా నెదర్లాండ్స్లోని ఒక బ్యాంక్ ఖాతాలో రూ. 7 కోట్లు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ నిధులను అంతర్జాతీయ డెబిట్ కార్డులను ఉపయోగించి భారతదేశంలో నగదు రూపంలో విత్డ్రా చేశారు. ఈ రాకెట్ ద్వారా వేలాది మంది మహిళలను నియమించి ఉండవచ్చని దర్యాప్తు సంస్థ తెలిపింది.