Pawan Kalyan: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

- రేపు తెలుగు సంవత్సరాది ఉగాది
- ఓ ప్రకటన విడుదల చేసిన పవన్ కల్యాణ్
- తెలుగు లోగిళ్లు సిరిసంపదలతో పచ్చగా ఉండాలని ఆకాంక్ష
రేపు తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన ముంగిళ్ళకు వచ్చిన ఉగాది తెలుగువారి వారసత్వపు పండుగ అని అభివర్ణించారు. పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు... జాతిని సజీవంగా నిలుపుతాయని తెలిపారు. ఉగాది పండుగ ఈసారి విశ్వావసు అనే గంధర్వుడి పేరిట వచ్చిందని, ఈ ఉగాది పండుగకు తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
"జీవితం కష్టసుఖాల సమ్మేళనం. మన ఉగాది పచ్చడిని అందుకు నిదర్శనంగా భావిస్తాం. గత ప్రభుత్వ పాలన కష్టాలమయం కాగా, ఇప్పుడు ప్రజలకు సుఖాలను అందించే మంచి పాలన ఏపీలో ప్రజల ముంగిటనకు వచ్చింది. చైత్రమాసపు శోభతో వసంతాన్ని మోసుకువచ్చిన శ్రీ విశ్వావసు నామ ఉగాది తెలుగు లోగిళ్లను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ వివరించారు.