Sunil Yadav: ఆ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీకెందుకు ఉలికిపాటు?: సునీల్ యాదవ్

- ఇటీవల హత్య సినిమా విడుదల
- అందులోతనను, తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారన్న సునీల్ యాదవ్
- ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు
- మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తనపై ఆరోపణలు చేస్తున్నాడని తాజాగా మీడియా సమావేశం
వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ నేడు కడపలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనపై అనేక ఆరోపణలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్న రాచమల్లు తన వద్ద కోట్లు ఎక్కడున్నాయో నిరూపించాలని సవాల్ విసిరారు. హత్య సినిమాను వైసీపీ నేతలు తీసినట్టు అనుమానం కలుగుతోందని అన్నారు.
ప్రొద్దుటూరులో బీసీ నేతను ఎవరు చంపించారో అందరికీ తెలుసని అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక రాచమల్లు ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలని నిలదీశారు. హత్య సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీకెందుకు ఉలికిపాటు? అని ప్రశ్నించారు. అవినాశ్రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ పాత్రలు ఆ సినిమాలో ఎందుకు చూపలేదని అన్నారు. తనకు ఏదైనా జరిగితే వైసీపీ నేతలు, వివేకా హత్య కేసు నిందితులదే బాధ్యత అని సునీల్ యాదవ్ స్పష్టం చేశారు.
ఈ మధ్య విడుదలైన హత్య సినిమాలో తనను, తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని సునీల్ యాదవ్ కొన్నిరోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై పోలీసులు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయితపై కేసు నమోదు చేశారు.