Duvvada Srinivas: విద్యుత్తు కనెక్షన్ తొలగించిన సిబ్బంది.. ఏఈకి ఫోన్ చేసి బూతులు తిట్టిన ఎమ్మెల్సీ దువ్వాడ

MLC Duvvada Srinivas abuses Electricity official

  • మూడు నెలలగా చెల్లించని విద్యుత్తు బకాయిలు
  • 56,692 రూపాయల బకాయిలు
  • ఏఈకి ఫోన్ చేసి బెదిరించిన దువ్వాడ శ్రీనివాస్
  • టెక్కలి వదిలి పారిపోయేలా చేస్తానని హెచ్చరిక
  • ఆ తర్వాత బిల్లు కట్టడంతో విద్యుత్తు కనెక్షన్ పునరుద్ధరణ

వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోమారు చెలరేగిపోయారు. బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్తు కనెక్షన్ కట్ చేసినందుకు విద్యుత్తు అధికారిపై చిందులు తొక్కారు. బూతులు తిడుతూ బెదిరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని అక్కవరంలో దువ్వాడకు ఓ ఇల్లు ఉంది. మూడు నెలలుగా దాని విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో రూ. 56,692 బకాయి పడ్డారు. అదే ఇంటికి డి.మాధురి పేరుతో ఉన్న కనెక్షన్‌కు మాత్రం బిల్లులు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే, దువ్వాడ పేరున ఉన్న కనెక్షన్‌కు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్తు బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీంతో నిన్న విద్యుత్తు సిబ్బంది ఆ కనెక్షన్‌ను తొలగించారు.

విషయం తెలిసిన దువ్వాడ వెంటనే టెక్కలి విద్యుత్తుశాఖ ఏఈ మురళీమోహన్‌రావుకు ఫోన్ చేసి బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనెక్షన్ ఎలా కట్ చేస్తారని, ఎవరి ఇంటికి వచ్చి కనెక్షన్ కట్ చేశారో తెలుసా? అని బెదిరించారు. ఒక ఎమ్మెల్సీ ఇంటికొచ్చి కనెక్షన్ కట్ చేయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించారు. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? అని హెచ్చరించారు. కట్టిన బిల్లుకు ఎలా కట్ చేస్తావని, నిన్ను కోర్టుకు లాగి జీవితం మొత్తం ఊడ్చిపెట్టేస్తానని హెచ్చరించారు. పేమెంట్ అయిపోయి వారం రోజులు అయిందని, ఏ రైట్స్‌తో కట్ చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. నీ ఉద్యోగానికి నరకం చూపిస్తానని, ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానని, టెక్కలి వదిలి పారిపోయేలా చేస్తానని బెదిరించారు. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్సీ బకాయి మొత్తాన్ని చెల్లించడంతో కనెక్షన్‌ను పునరుద్ధరించినట్టు ఏఈ తెలిపారు.

Duvvada Srinivas
YCP MLC
Power connection
Electricity bill
Abuse
Threat
Telugu Desam Party
Andhra Pradesh Politics
Sri Kakulam
Telugu News
  • Loading...

More Telugu News