Nara Lokesh: ఇక ఉల్లాసంగా, ఉత్సాహంగా విద్య... మంత్రి నారా లోకేశ్ చొరవతో 'నో బ్యాగ్ డే'

- ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
- 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వర్తింపు
- విద్యార్థులపై పాఠశాల విద్య భారం తగ్గించడమే లక్ష్యం
- నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులపై పాఠశాల విద్య భారాన్ని తగ్గించేందుకు, వారిలో నైపుణ్యాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ 'నో బ్యాగ్ డే' అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
బడి అంటే బరువైన పుస్తకాలతో నిండిన బ్యాగులు, పరీక్షల భయం అనే ముద్రను చెరిపేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని విద్యార్థులకు చదువును మరింత ఆనందదాయకంగా మార్చేందుకు, నైపుణ్యాలను వెలికితీసేందుకు 'నో బ్యాగ్ డే' కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' నిర్వహించనున్నారు.
పుస్తకాల భారం తగ్గించి ఆటపాటలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 'నో బ్యాగ్ డే' రోజున విద్యార్థులకు సాంప్రదాయ తరగతులకు బదులుగా అనేక రకాల వినోదాత్మక, విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తారు.
నో బ్యాగ్ డే'లో విద్యార్థులకు వినోదం, విజ్ఞానం
* క్విజ్ పోటీలు: విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు, వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు క్విజ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
* వృత్తి విద్యా శిక్షణ: విద్యార్థులకు వివిధ వృత్తులపై అవగాహన కల్పించి, ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇస్తారు.
* సెమినార్లు, చర్చలు: సమకాలీన అంశాలపై నిపుణులతో సెమినార్లు నిర్వహించి, విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తారు.
* క్రీడా పోటీలు: విద్యార్థుల్లో శారీరక ధారుడ్యాన్ని పెంపొందించేందుకు వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
* లలిత కళలు: డ్రాయింగ్, పెయింటింగ్, సంగీతం, నృత్యం వంటి లలిత కళల్లో విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీస్తారు.
* మాక్ పార్లమెంట్: విద్యార్థులకు రాజకీయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు మాక్ పార్లమెంట్ నిర్వహిస్తారు.
దీనిపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... "విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని పెంచేందుకే 'నో బ్యాగ్ డే' కార్యక్రమం. ఇది విద్యార్థులకు ఒక వినూత్న అనుభూతిని అందిస్తుంది. నైపుణ్యాధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యం. 'నో బ్యాగ్ డే' అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది విద్యావ్యవస్థలో ఒక నూతన శకానికి నాంది పలుకుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరింత ఉత్సాహంగా, సంతోషంగా విద్యను అభ్యసిస్తారని ఆశిద్దాం" అని అన్నారు.