Myanmar earthquake: భారీ భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి

- మయన్మార్, థాయిలాండ్ లో భారీ భూకంపం
- రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్ సైనిక ప్రభుత్వం
- థాయిలాండ్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
మయన్మార్ దేశం ఇవాళ భారీ భూకంపం దాటికి విలవిల్లాడింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత గరిష్ఠంగా 7.7గా నమోదైంది. భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి చెందారు. భారీ భవనాలు నేలమట్టం కాగా, శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పలువురికి గాయాలయ్యాయి.
అటు, మయన్మార్ రాజధాని నేపిడాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భూ ప్రకంకపనల ప్రభావంతో మాండలే నగరంలో ఐకానిక్ వంతెన కూడా కూలిపోయింది. దేశంలో పలు చోట్ల ఎత్తయిన ప్రార్థనా మందిరాలు, గోపురాలు కూలిపోయాయి. భూకంపం నేపథ్యంలో, మయన్మార్ సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోరింది. మానవతా దృక్పథంతో సాయం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది.
బ్యాంకాక్ లో ముగ్గురి మృతి
థాయిలాండ్ లోనూ ఇవాళ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రాజధాని బ్యాంకాక్ లో ఓ భారీ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ భవనం శిథిలాల్లో 80 మంది చిక్కుకున్నట్టు థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. సహాయక సిబ్బంది ఇప్పటివరకు ఏడుగురిని కాపాడారు.
ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన భారత్
థాయిలాండ్ లో భారతీయుల సహాయార్థం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. భూకంపం ప్రభావానికి గురైన భారతీయులు ఈ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని థాయిలాండ్ లోని భారత ఎంబసీ పేర్కొంది. థాయిలాండ్ లోని భారత ఎంబసీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్: +66 618819218