KTR: అందాల పోటీలను ఆపేయండి!: శాసనసభలో కేటీఆర్

- అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్న కేటీఆర్
- గురుకుల పాఠశాలల్లో విషాహారంతో బాధపడుతున్నారన్న కేటీఆర్
తెలంగాణలో నిర్వహించనున్న అందాల పోటీలను ఆపేసి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
విద్య కోసం బడ్జెట్లో 15 శాతం కేటాయిస్తామని చెప్పారని, కానీ ఏడున్నర శాతం మాత్రమే ప్రకటించారని తెలిపారు. విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారని, పిల్లల ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారని కానీ, ఏదీ నెరవేరలేదని విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు విషాహారంతో బాధపడుతున్నారని విమర్శించారు.
తాము ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించామని, మరో రూ. 8 వేల కోట్లు ఉన్నాయని వాటిని చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అందాల పోటీల కోసం ఖర్చు పెట్టే బదులు విద్యార్థినులకు స్కూటీల కోసం ఖర్చు పెట్టాలని సూచించారు. రూ. 500 కోట్లతో కొందరికైనా స్కూటీలు వస్తాయని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాల గురించి చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 11 వేల ఉద్యోగాలే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని అన్నారు. గ్రూపు-2 పోస్టులు పెంచుతామని చెప్పి పెంచలేదని విమర్శించారు.