Boma Akhila Priya: బ్రాయిలర్ కోళ్లతో భూమా అఖిలప్రియ నిరసన ప్రదర్శన... ఎందుకంటే...!

- సాక్షి పత్రికలో తనపై తప్పుడు రాతలు రాస్తున్నారన్న అఖిలప్రియ
- తప్పుడు కథనాలు రాస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
- కూటమి ప్రభుత్వం వచ్చాక చికెన్ ధరలు తగ్గాయని వెల్లడి
టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియఇవాళ దిన్నెదేవరపాడు వద్ద సాక్షి కార్యాలయం ఎదుట కోళ్లతో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. గతంలో తాను విలేకరుల సమావేశంలో పేపర్లో వచ్చే ధరకే చికెన్ ఇప్పిస్తానని చెప్పానని, దాని కోసం పోరాటం చేస్తుంటే, కమీషన్ తీసుకుంటున్నట్లు సాక్షి పత్రికలో తనపై తప్పుడు కథనాలు ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల నుంచి కేజీకి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అధికారంలో ఉంటే వైసీపీ నాయకులు మీడియా కార్యాలయాలపై దాడులు చేసేవారని, కానీ తమ ప్రభుత్వంలో కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నామని ఆమె అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నంద్యాలలో కేజీ చికెన్ ధర రూ.250 నుంచి రూ.280 ఉండేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం వచ్చాక ఆళ్లగడ్డలో చికెన్ ధర రూ.150 నుంచి రూ.170కి తగ్గిందని ఆమె తెలిపారు. తాము అవినీతికి పాల్పడితే ధరలు పెరగాలి కానీ, ఎందుకు తగ్గుతాయని ఆమె ప్రశ్నించారు. తప్పుడు కథనాలు రాస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.