Revanth Reddy: నేను అదే చేసి ఉంటే... కేటీఆర్ జైల్లో ఉండేవారు: రేవంత్ రెడ్డి

- కక్షపూరిత రాజకీయాలకు తాము దూరమన్న రేవంత్ రెడ్డి
- తనను జైల్లో పెట్టి వేధించారని మండిపాటు
- కేసీఆర్, కేటీఆర్ లను జైల్లో వేయాలని చాలా మంది అడుగుతున్నారని వ్యాఖ్య
కక్షపూరిత రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇలాంటి రాజకీయాలకు దూరమని, తాము కూడా కక్షపూరిత రాజకీయాలను చేస్తే ఇప్పటికే కేటీఆర్ చంచల్ గూడ జైల్లో ఉండేవారని చెప్పారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ. 500 జరిమానా విధిస్తారని... కానీ, అప్పట్లో ఎంపీగా ఉన్న తాను డ్రోన్ ఎగరవేశానని జైల్లో పెట్టి వేధించారని మండిపడ్డారు. తన కూతురు పెళ్లికి కూడా తాను బెయిల్ పై వచ్చి మళ్లీ జైలుకు వెళ్లానని తెలిపారు.
ప్రతీకార రాజకీయాలను తాను కూడా చేయాలనుకుని ఉంటే... ఈ పాటికే కొందరు జైల్లో ఉండేవారని రేవంత్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ లను జైల్లో వేయాలని తమను చాలా మంది అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు బనాయించి, వాళ్లను జైళ్లకు పంపే నీచ రాజకీయాలను తాను చేయనని చెప్పారు.