KTR: అవయవ దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా: కేటీఆర్

- తెలంగాణ అసెంబ్లీలో అవయవ దానం బిల్లు
- ప్రజాప్రతినిధులు అవయవ దానం చేయాలన్న కేటీఆర్
- సభ్యులు ముందుకొస్తే తొలి సంతకం తానే చేస్తానని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. అవయవ దానానికి తాను సిద్ధమని చెప్పారు. శాసనసభలో అవయవ దానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అవయవదానం చేయాలని... అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పారు.
అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని... నియోజకవర్గాల్లో అవయవదానంపై చైతన్యం తీసుకురావాలని కేటీఆర్ అన్నారు. అవయవదానానికి సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామని అన్నారు. తొలి సంతకం తానే చేస్తానని చెప్పారు. అవయవదానం ఎంతో గొప్ప మానవీయ చర్య అని... ఇది మరికొందరికి జీవితాన్ని ప్రసాదిస్తుందని అన్నారు.