Salman Khan: బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలపై సల్మాన్ ఖాన్ వైరాగ్యం.. హీరో ఏమన్నారంటే?

- ఆయువు ఉన్నంతకాలం బతుకుతామన్న హీరో
- దేవుడు రాసిపెట్టినంత కాలం బతికేస్తానని వ్యాఖ్య
- సికందర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో స్పందన
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను హతమారుస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ పదే పదే హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ను అంతమొందించేందుకు పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించింది. ఈ హెచ్చరికలు, హత్యాయత్నాలపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించారు. తన తాజా చిత్రం ‘సికందర్’ ప్రమోషన్ కార్యక్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. దేవుడు రాసిపెట్టినంత కాలం జీవిస్తానని వైరాగ్యంతో స్పందించారు. తన జీవితం అల్లా చేతుల్లో ఉందని, ఆయన ఎంతకాలం జీవించాలని రాశాడో తెలియదని అన్నారు. ఎవరు ఎంత కాలం జీవించాలని దేవుడు ముందే రాసిపెడతాడని సల్మాన్ చెప్పారు. ఎవరూ కూడా శాశ్వతంగా భూమిమీదే ఉండిపోలేరని, ఆయుష్షు ఉన్నంతకాలం జీవించక తప్పదన్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల ముంబైలోని సల్మాన్ అపార్ట్ మెంట్ వద్ద ఇద్దరు యువకులు కాల్పులు జరపడం తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ అప్పట్లో ఓ ప్రకటన విడుదల చేసింది. కాల్పులకు పాల్పడింది తమ మనుషులేనని, సల్మాన్ ను హతమార్చేందుకు ప్రయత్నించామని తెలిపింది. కృష్ణ జింకలను వేటాడిన ఘటనకు సంబంధించి బిష్ణోయ్ కమ్యూనిటీకి సల్మాన్ బహిరంగ క్షమాపణ చెబితే అతడిని ప్రాణాలతో వదిలేసే విషయం ఆలోచిస్తామని పేర్కొంది. కాల్పుల ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్ భద్రతను భారీగా పెంచింది.