IPL: బాప్రేబాప్... ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ రూ. లక్ష కోట్లు!

- ఐపీఎల్ బ్రాండ్ విలువ 2024లో రూ. 1 లక్ష కోట్లు దాటిందన్న 'టైమ్స్ ఆఫ్ ఇండియా'
- 2009లో 2 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2024లో 12 బిలియన్ డాలర్లకు చేరిన వైనం
- ఇందులో మీడియా రైట్సే రూ. 48వేల కోట్లు
- ప్రతి సీజన్లో ఐపీఎల్కు మీడియా రైట్స్ ద్వారానే రూ. 12వేల కోట్ల ఆదాయం
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది 18వ సీజన్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 22 నుంచి ప్రారంభమైన లీగ్ మే 25 వరకు కొనసాగుతుంది. విశేష ప్రజాదరణ కలిగిన ఐపీఎల్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. ఈ మెగా టోర్నీ బ్రాండ్ విలువ, ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్లో అతిపెద్ద ఫ్రాంచైజీ ఈవెంట్ అయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే మతిపోవాల్సిందే.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ విలువ 2024లో రూ. 1 లక్ష కోట్లను దాటింది. ఈ టోర్నీలో పాల్గొంటున్న 10 జట్ల సమిష్టి ఆదాయం 2024లో రూ. 6,797 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో ఐపీఎల్ సమష్టి బ్రాండ్ విలువ 13 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు (రూ. 10,29,09,68,55,600) చేరుకుందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' తెలిపింది.
2009లో 2 బిలియన్ డాలర్లుగా ఉన్న బ్రాండ్ వాల్యూ, 2024కు వచ్చేసరికి 12 బిలియన్ డాలర్లకు చేరింది. 2023లోనే తొలిసారి 10 బిలియన్ మార్కును దాటి 10.7 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఇందులో మీడియా రైట్సే రూ. 48వేల కోట్లు కావడం గమనార్హం.
టోర్నీలోని నాలుగు ప్రధాన జట్లు అయిన కోల్కతా నైట్ రైడర్ (కేకేఆర్), ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ల బ్రాండ్ వాల్యూనే 100 మిలియన్ డాలర్లు (రూ. 8,57,75,65,000) దాటిపోయింది. ప్రతి సీజన్లో ఐపీఎల్కు మీడియా రైట్స్ ద్వారానే రూ. 12వేల కోట్ల ఆదాయం వస్తోంది. పైగా ప్రభుత్వం ఐపీఎల్కు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం గమనార్హం.
అయితే, భారత ప్రభుత్వం ఎటువంటి పన్నులు పొందకపోయినా మ్యాచ్ల నుంచి చాలా సంపాదిస్తుంది. 2024 నవంబర్లో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం ద్వారా కేంద్ర ఖజానాకు రూ. 90 కోట్లు చేరాయి. ఈ ఆదాయం క్రికెటర్ల జీతం నుంచి ప్రభుత్వానికి అందుతున్నాయి. టీడీఎస్ ద్వారా ప్రభుత్వానికి ఈ ఆదాయం సమకూరుతోంది. ఐపీఎల్ ఆడే స్వదేశీ క్రికెటర్ల జీతాల నుంచి 10 శాతం, విదేశీ ప్లేయర్ల శాలరీల నుంచి 20 శాతం ప్రభుత్వానికి అందుతోంది.