Kadapa Zilla Parishad: నేడు కడప జడ్పీ ఛైర్మన్ ఎన్నిక.. హైదరాబాద్ క్యాంప్ నుంచి కడపకు చేరుకున్న వైసీపీ సభ్యులు

- ఉదయం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు
- తమ సభ్యులకు విప్ జారీ చేసిన వైసీపీ
- పోటీకి దూరంగా ఉంటామన్న టీడీపీ
నేడు ఉమ్మడి కడప జిల్లాపరిషత్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు ఛైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జిల్లాపరిషత్ లో మొత్తం 50 మంది జడ్పీటీసీల్లో వైసీపీకి 38 మంది జడ్పీటీసీల మద్దతు ఉంది. దీంతో, జిల్లా పరిషత్ వైసీపీ కైవసం అయ్యే అవకాశం ఉంది. జడ్పీ ఛైర్మన్ రేసులో తాము లేమని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది.
జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో, ఛైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నారు. బ్రహ్మంగారిమఠం మండలం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీలను నాలుగు రోజుల పాటు క్యాంపులో ఉంచారు. వైసీపీ జడ్పీటీసీలు హైదరాబాద్ క్యాంప్ నుంచి కడపకు చేరుకున్నారు. తమ సభ్యులకు వైసీపీ విప్ జారీ చేసింది. ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని టీడీపీ ప్రకటించినప్పటికీ... చివరి నిమిషంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.