Environmental Damage: భారీ సంఖ్యలో చెట్ల నరికివేత ‘హత్య’తో సమానమేనన్న సుప్రీంకోర్టు

Supreme Court equates mass tree felling to murder

  • తాజ్ ట్రాపెజియం జోన్ లో 454 చెట్లను కొట్టేయించిన వ్యాపారిపై సీరియస్
  • ఆ చెట్లను తిరిగి పెంచడానికి కనీసం వందేళ్లు పడుతుందని వ్యాఖ్య
  • ఒక్కో చెట్టుకు రూ.1 లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశం

పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం మనిషిని చంపేయడానికి ఏమాత్రం తీసిపోని నేరమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తాజ్ ట్రాపెజియం జోన్ లో ఏకంగా 454 చెట్లను నరికివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మధురకు చెందిన దాల్మియా ఫార్మ్స్ కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది. కొట్టేసిన చెట్ల స్థానంలో తిరిగి పచ్చదనం నెలకొల్పాలంటే కనీసం వందేళ్లు పడుతుందని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే వారి విషయంలో ఎలాంటి జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. చెట్ల నరికివేతకు పాల్పడిన దాల్మియా ఫార్మ్స్ యజమానికి భారీ మొత్తంలో జరిమానా విధించింది.

నరికివేసిన 454 చెట్లకు సంబంధించి ఒక్కో చెట్టుకు రూ. లక్ష చొప్పున ఫైన్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతోపాటు తాజ్ ట్రాపెజియం జోన్ సమీపంలో మొక్కల పెంపకం చేపట్టాలని నిందితుడిని ఆదేశించింది. ఈ సందర్భంగా 2019లో ఇచ్చిన ఆదేశాలను కోర్టు గుర్తుచేసింది. తాజ్ ట్రాపెజియం జోన్ పరిధిలో అటవీ ప్రాంతం కానిచోట, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని తన తీర్పులో ఉదహరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.

Environmental Damage
Illegal Deforestation
Dalmia Farms
Supreme Court of India
Taj Trapezium Zone
Tree Felling
Justice Abhay Oka
Justice Ujjal Bhuyan
Environmental Fine
India
  • Loading...

More Telugu News