Guntur Chilli Farmers: గుంటూరులో మిర్చి రైతుల ఆందోళన

Farmers Protest in Guntur Over Chilli Prices

  • గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఆందోళన నిర్వహించిన రైతులు
  • మూడు గంటల పాటు రహదారిపై బైఠాయించడంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ 
  • రైతులతో చర్చించి ఆందోళన విరమింపజేసిన జేసీ భార్గవ తేజ

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట నల్లపాడు రోడ్డుపై రైతులు బైఠాయించి దాదాపు మూడు గంటల పాటు నిరసన తెలిపారు.

వ్యాపారుల మాయాజాలంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి యార్డుకు సరుకు తీసుకొస్తే కొనుగోలు చేస్తారన్న నమ్మకం కూడా లేకుండా పోయిందని వాపోయారు. వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న మిర్చి యార్డ్ పర్సన్ ఇన్ ఛార్జ్, జేసీ భార్గవ తేజ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. గిట్టుబాటు ధర కల్పించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. ధరలు కనిపించేలా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. మరోవైపు ఈ రైతుల ఆందోళన వెనుక ఎవరున్నారనే దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. 

  • Loading...

More Telugu News