Jagdeep: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. యోగా టీచర్ను ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన భర్త!

- బాధితుడిని డిసెంబర్లో కిడ్నాప్ చేసిన నిందితుడు
- తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని ఘాతుకం
- కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి బతికి ఉండగానే పాతిపెట్టిన వైనం
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్ను ఓ వ్యక్తి ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు. హర్యానాలోని చక్రి దాద్రిలో జరిగిందీ ఘటన. బాధితుడు జగదీప్ రోహ్తక్లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో యోగా టీచర్. ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడుగుల గొయ్యి తీసి అందులో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. మూడు నెలల తర్వాత ఈ నెల 24న జగదీప్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.
పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 24న జగదీప్ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయనను కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులు ధర్మపాల్, హర్దీప్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణ సందర్భంగా నిందితుడు భయంకరమైన నిజాలను వెల్లడించాడు. నిందితుడు ఉంటున్న భవనంలోనే జగదీప్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో నిందితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతిమంగా ఇది ఆయన హత్యకు దారితీసింది.