Raghubabu: 'కన్నప్ప' చిత్రం గురించి ట్రోల్ చేస్తే కచ్చితంగా శివుడి శాపానికి గురవుతారు: నటుడు రఘుబాబు

- మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప మూవీ
- మోహన్ బాబు నిర్మాణంలో ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో చిత్రం
- ప్రమోషన్ ఈవెంట్ లో ట్రోలర్స్ ను సీరియస్ గా హెచ్చరించిన రఘుబాబు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కు సిద్ధమైంది. మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎపిక్ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఓ ప్రమోషన్ ఈవెంట్ లో నటుడు రఘుబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. వేదికపై మంచు విష్ణు, బ్రహ్మాజీ, రఘుబాబు కూర్చుని ఉండగా, ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడిగారు.
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేను చెప్పేది వినండి అంటూ రఘుబాబు మైక్ అందుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడే చెబుతున్నా... ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు... గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది 100 శాతం జరిగి తీరుతుంది. ఎవరైనా సరే... ట్రోల్ చేశారంటే ఫినిష్!" అంటూ సీరియస్ గా హెచ్చరించారు.