KCR: కేసీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ రేవంత్ ని కలిసిన గజ్వేల్ నేతలు

- కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదన్న గజ్వేల్ నేతలు
- సొంత నియోజకవర్గానికి కూడా రావడం లేదని విమర్శ
- సిద్ధిపేట కలెక్టరేట్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర
బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని, సొంత నియోజకవర్గానికి కూడా రావడం లేదని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్ భవన్ వరకు గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టాయి. ఈ క్రమంలో వారు రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు వినతిపత్రం అందించారు. అదేవిధంగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం అందించనున్నారు.