Anchor Shyamala: బాధ్యత గల పౌరురాలిగా ఇక అలాంటి పనులు చేయను: యాంకర్ శ్యామల

- బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన కేసులో విచారణకు హాజరైన శ్యామల
- ఇకపై బెట్టింగ్ లు ప్రమోట్ చేయనని వ్యాఖ్య
- విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న శ్యామల
ఆన్ లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల పోలీసు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామలను పోలీసులు దాదాపు రెండున్నర గంటలకు పైగా విచారించారు.
విచారణ ముగిసిన అనంతరం మీడియాతో శ్యామల మాట్లాడుతూ... బెట్టింగ్ ను ఇకపై ప్రమోట్ చేయనని చెప్పారు. బాధ్యతగల పౌరురాలిగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు.
బెట్టింగ్ లకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల చెప్పారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని... విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున... మాట్లాడటం సరికాదని చెప్పారు.