KTR: కరీంనగర్ కు బయల్దేరిన కేటీఆర్

- కరీంనగర్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశం
- హాజరవుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తలు
- కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు బయల్దేరారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితర నేతలు ఉన్నారు. 25 ఏళ్ల వసంతాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో రజతోత్సవ సభను బీఆర్ఎస్ నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ఈరోజు కరీంనగర్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఈ భేటీలో పాల్గొనేందుకు కేటీఆర్ కరీంనగర్ కు బయల్దేరారు.
ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ముఖ్య కార్యకర్తలు తరలిరానున్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వీ కన్వెషన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 5 వేల మంది ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. కరీంనగర్ రాంనగర్ చౌరస్తా నుంచి ప్రారంభమై తెలంగాణ చౌక్, కమాన్ మీదుగా సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.