Baireddy Sabari: నేను పవన్ కల్యాణ్ అభిమానిని అని చెప్పినా ర్యాగింగ్ చేశారు: ఎంపీ బైరెడ్డి శబరి

- ఉమ్మడి కర్నూలు జిల్లా పూడిచర్లలో కార్యక్రమం
- ఆసక్తికర అంశం వెల్లడించిన ఎంపీ శబరి
- జనసైనికులు గట్టివారన్న పవన్
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పవన్ కల్యాణ్ అభిమానుల గురించి ఆసక్తికర అంశం వెల్లడించారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో జరిగిన ఒక సభలో ఆమె మాట్లాడుతూ, తాను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు రాగింగ్ అనుభవం ఎదురైందని గుర్తు చేసుకున్నారు.
"నేను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు, సీనియర్లు నా ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు. నేను పవన్ కల్యాణ్ అని చెప్పగానే, సుమారు 100 మంది నన్ను చుట్టుముట్టారు. పవన్ కల్యాణ్ అభిమానులం మేం.... నువ్వేంటి? అన్నారు. ఆ తరువాత సంవత్సరం వరకు నేను పవన్ కల్యాణ్ పేరు ఎత్తలేదు" అని ఆమె సరదాగా అన్నారు.
జనసైనికులు నిజంగా చాలా గట్టివారని, వారు తెగించి పనిచేసి కూటమికి అఖండ విజయాన్ని అందించారని శబరి కొనియాడారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... జనసైనికులు గట్టివారని కితాబిచ్చారు. కష్ట సమయంలో మీరు నిలబడ్డారు, మమ్మల్ని నిలబెట్టారు అని కొనియాడారు. మీరు బలం ఇవ్వడం వల్లే 175కి 164 సీట్లు, 21 పార్లమెంట్ సీట్లు గెలవగలిగామని అన్నారు. ఇది సామాన్యమైన విజయం కాదని, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిందని పేర్కొన్నారు. మీలాంటి కమిట్ మెంట్ ఉన్న వ్యక్తులు, యువత లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని పవన్ అన్నారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది, యువతది, మహిళలది అని స్పష్టం చేశారు.