Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs Move Privilege Motion Against Minister Komatireddy

  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • సభను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • స్పీకర్‌కు ఆధారాలు సమర్పించిన ఎమ్మెల్యేలు

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. ఈ మేరకు వారు ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సభలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సభను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి మంత్రి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని వారు స్పీకర్‌కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎఫ్ నిధులు రాలేదని, నల్గొండ నియోజకవర్గ రోడ్లకు నిధులు కేటాయించలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఎస్క్రో అకౌంట్ తెరవలేదని మంత్రి కోమటిరెడ్డి ఇచ్చిన సమాధానం పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఆధారాలు సమర్పించారు. కోమటిరెడ్డిపై తమ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును తక్షణమే అనుమతించాలని వారు కోరారు.

  • Loading...

More Telugu News