Raja Singh: తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

- కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంపుగానే ఉంటారని విమర్శ
- గతంలో మనం చూసిన అధ్యక్షుడు గ్రూపును తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారని ఆరోపణ
- కొత్త అధ్యక్షుడు ముఖ్యమంత్రితో రహస్య చర్చలు నిర్వహించవద్దన్న రాజాసింగ్
తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త బీజేపీ అధ్యక్షుడు రానున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే, ఈ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా లేక జాతీయ నాయకత్వమా అని ఆయన ప్రశ్నించారు. కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే ఆయన రబ్బర్ స్టాంపుగానే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో ఒక అధ్యక్షుడు తన సొంత గ్రూపును తయారు చేసుకొని పార్టీకి చాలా నష్టం చేశారని ఆయన ఆరోపించారు. కొత్త పార్టీ అధ్యక్షుడు కూడా అదే విధంగా గ్రూపిజానికి పాల్పడితే పార్టీకి నష్టం జరుగుతుందని రాజాసింగ్ అన్నారు. ప్రస్తుతం మంచి నాయకుల చేతులను కట్టిపడేశారని ఆయన విమర్శించారు. సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడు ముఖ్యమంత్రితో రహస్య చర్చలు నిర్వహించవద్దని ఆయన సూచించారు.
సీనియర్ నేతలు, కార్యకర్తల మనసులోని మాటనే తాను బయటపెడుతున్నానని రాజాసింగ్ అన్నారు. పార్టీ నేతలకు చెప్పాలి గానీ మీడియా ముందుకు వెళ్లవద్దని కొందరు చెబుతున్నారని, కానీ పార్టీ పెద్దల దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడం వల్లే ప్రజల ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. సీనియర్ నాయకులను బీజేపీ గుర్తించడం లేదని ఆయన విమర్శించారు. నామినేటెడ్ పోస్టులను సీనియర్ నేతలకు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.