Mobile Phones: షాకింగ్ రిపోర్ట్.. తెలంగాణలో జనాభా కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువ..!

- ట్రాయ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4.19 కోట్లు
- ఇందులో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 4.4 కోట్లు
- ల్యాండ్లైన్ వినియోగదారుల సంఖ్య 15.25 లక్షలు
- రాష్ట్రంలో సగటున ప్రతి 100 మందికి 105కి పైగా మొబైల్ ఫోన్లు
తెలంగాణలో రోజురోజుకూ మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జనాభా కంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 2024 సెప్టెంబర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4.19 కోట్లు. ఇందులో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 4.4 కోట్లు కాగా, ల్యాండ్లైన్ వినియోగదారుల సంఖ్య15.25 లక్షలుగా ఉంది.
ఇక టెలిఫోన్ వినియోగదారుల్లో 60 శాతానికి పైగా పట్టణ ప్రాంతాల్లో ఉంటే.. 39 శాతానికి పైగా గ్రామీణంలో ఉన్నారు. కేవలం మొబైల్ ఫోన్ల వినియోగదారులను చూస్తే పట్టణాల్లో 59 శాతం మంది, గ్రామీణ ప్రాంతంలో 41 శాతం మంది ఉన్నారు. అలాగే ల్యాండ్లైన్ వినియోగదారుల్లో 96 శాతం పట్టణాల్లో ఉంటే.. గ్రామీణంలో కేవలం 4 శాతం మాత్రమే. ట్రాయ్ నివేదిక ప్రకారం మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి రాష్ట్ర వైర్లెస్ టెలీ డెన్సిటీ 105.32 శాతంగా ఉంది. అంటే రాష్ట్రంలోని సగటున ప్రతి 100 మందికి 105కి పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
ఈ అంశంలో రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉంది. గోవా-152, కేరళ-115, హర్యానా 114 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 3.64కోట్లుగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ గణాంకాలు తెలంగాణ ప్రజలు కమ్యూనికేషన్,టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తున్నాయి. సమాచార సేకరణ, డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ విద్య వంటి అనేక అవసరాల కోసం మొబైల్ ఫోన్లు నేడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో మొబైల్ కనెక్టివిటీ ఉండటం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యం.