KGBV: కేజీబీవీలలో ప్రవేశాలకు ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ

--
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీనివాసరావు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22 (శనివారం) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. దరఖాస్తులకు సంబంధించి సందేహాలను 70751-59996, 70750-39990 నెంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చన్నారు.
ఏపీలో 352 కేజీబీవీలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. దీనికి సంబంధించి తాజాగా దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. కేజీబీవీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 11 చివరి తేదీ అని ఎస్పీడీ తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేద (బీపీఎల్ పరిధిలోని) బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.