Sudhir Babu: ఉప్పల్లో రేపు ఐపీఎల్ మ్యాచ్.. ఈ వస్తువులు తీసుకెళ్లొద్దు!

- రేపు హైదరాబాద్-రాజస్థాన్ జట్ల మధ్య ఉప్పల్లో మ్యాచ్
- 2,700 మంది పోలీసులు, 450 సీసీ కెమెరాలతో నిఘా
- అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు
నేటి నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగే మ్యాచ్లకు భారీ భద్రత కల్పించారు. మొత్తం 2,700 మంది పోలీసులతో బందోబస్తు కల్పించడంతోపాటు స్టేడియం లోపల, బయట కలిపి 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
స్టేడియంలోకి ల్యాప్టాప్లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, అత్తర్లు, బ్యాగులు, బయటి ఆహార పదార్థాలను అనుమతించబోమని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు.
క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులు తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేలా అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. స్టేడియం సామర్థ్యం 39 వేలు అని వివరించారు. రేపు (ఆదివారం) హైదరాబాద్ సన్ రైజర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.