Adi Pinishetti: కాలేజ్ లో ప్రేతాత్మలు .. ఓటీటీకి 'శబ్దం'

- క్రితం నెలలో థియేటర్లకు వచ్చిన 'శబ్దం'
- ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి - లక్ష్మి మీనన్
- ప్రేతాత్మల చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 2 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి
ఆది పినిశెట్టి - లక్ష్మీ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'శబ్దం' సినిమా ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. గతంలో ఆది పినిశెట్టి నుంచి హారర్ థ్రిల్లర్ గా వచ్చిన 'వైశాలి' భారీ విజయాన్ని సాధించడంతో సహజంగానే 'శబ్దం'పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే థియేటర్ల నుంచి ఈ సినిమాకి ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను రాబట్టలేకపోయిందనే చెప్పాలి. అందుకు అనేక కారణాలు ఉండొచ్చు.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. అరివళగన్ వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సిమ్రాన్ .. లైలా .. రాజీవ్ మీనన్ .. వివేక్ ప్రసన్న ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
కథగా చెప్పుకోవాలంటే .. ఒక కాలేజ్ లో స్టూడెంట్స్ ఒకరి తరువాత ఒకరుగా చనిపోతూ ఉంటారు. అసలు ఏం జరుగుతోంది అనే విషయంలో నుంచి తేరుకునేలోగా కొంతమంది చనిపోతారు. కాలేజ్ లో ప్రేతాత్మలు తిరుగుతున్నాయనే ప్రచారం మొదలవుతుంది. దాంతో కాలేజ్ యాజమాన్యం, ఆత్మలతో మాట్లాడే శక్తి కలిగిన వైద్యలింగం అనే వ్యక్తిని రంగంలోకి దింపుతారు. అతను ఏం చెబుతాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.