Revanth Reddy: చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

- లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందించిన బ్రిడ్జ్ ఇండియా సంస్థ
- ఎక్స్ వేదికగా చిరుకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్
- ఆయనకు లభించిన ఈ గౌరవం తెలుగు జాతికి గర్వకారణమన్న ముఖ్యమంత్రి
యూకేలో బ్రిడ్జ్ ఇండియా సంస్థ ద్వారా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చిరుకు అభినందనలు తెలుపుతూ పోస్టు పెట్టారు.
"యూకేలో బ్రిడ్జ్ ఇండియా సంస్థ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు కొణిదెల చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగు జాతికి గర్వకారణం. భవిష్యత్ లో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వ వేదికపై చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. కాగా, మెగాస్టార్ నాలుగున్నర దశాబ్దాలకు పైగా సినీ, సమాజ సేవ రంగాల్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆయనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేసిన విషయం తెలిసిందే.