Rajneesh Kumar: విద్యార్థినులపై లైంగిక దాడులు... ఆపై బ్లాక్ మెయిలింగ్... కీచక ప్రొఫెసర్ అరెస్ట్

- ప్రొఫెసర్ రజనీష్ కుమార్ అరెస్ట్
- లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్కు పాల్పడిన వైనం
- 2009 నుండి నేరాలకు పాల్పడుతున్నట్లు అంగీకారం
- 65 వీడియోలు స్వాధీనం
విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై హత్రాస్ లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కళాశాల చీఫ్ ప్రొక్టర్గా పనిచేస్తున్న రజనీష్ కుమార్ (50)ను పోలీసులు యూపీలోని ప్రయాగ్రాజ్లో అరెస్టు చేశారు. చాలా సంవత్సరాలుగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అతడిని ప్రత్యేక పోలీసు బృందాలు గాలించి పట్టుకున్నాయి.
పోలీసుల విచారణలో రజనీష్ కుమార్ నేరాన్ని అంగీకరించాడు. 2009లో ఒక విద్యార్థినిపై లైంగిక దాడి చేయగా, అది వెబ్కెమెరాలో రికార్డ్ అయిందని, ఆ తర్వాతే విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి లంచాలు కూడా తీసుకున్నట్లు అంగీకరించాడు. మహిళలపై లైంగిక దాడి దృశ్యాలను రికార్డ్ చేసేందుకు తన కంప్యూటర్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా ఇన్స్టాల్ చేసుకున్నట్లు హత్రాస్ ఎస్పీ తెలిపారు. అతని వద్ద నుండి 65 వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
రజనీష్ కుమార్ 1996లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి పిల్లలు లేరు. 2001లో బాగ్లా కళాశాలలో అధ్యాపకుడిగా చేరి, గతేడాది చీఫ్ ప్రొక్టర్గా పదోన్నతి పొందాడు. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమంది విద్యార్థినులపై అత్యాచారం చేశాడో తెలియదని రజనీష్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.