Chiranjeevi: నా హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది: చిరంజీవి

- యూకే పార్లమెంటులో చిరంజీవికి అపురూప సన్మానం
- లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందించిన బ్రిడ్జ్ ఇండియా గ్రూప్
- సోషల్ మీడియాలో చిరంజీవి పోస్టు
యూకే పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం లభించింది. ఎంతోమంది పార్లమెంటు సభ్యులు, మంత్రులు, సహాయ మంత్రులు, దౌత్యవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్ ఇండియా బృందం ఆయనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. దీనిపై చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
"ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఈ గౌరవం పొందడం పట్ల నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. వారి నా గురించి చెప్పిన విషయాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.
బ్రిడ్జ్ ఇండియా బృందం అందించిన జీవితకాల సాఫల్య పురస్కారం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. నా అభిమానులు, రక్తదానంతో నా రక్త సోదరులు, రక్త సోదరీమణులుగా మారిన ప్రతి ఒక్కరికీ, సినీ కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నా కుటుంబ సభ్యులు, నా ప్రయాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, నేను చేపట్టిన మానవతావాద కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ గౌరవం నా పనిని మరింత ఉత్సాహంతో కొనసాగించడానికి నన్ను ప్రేరేపిస్తుంది. మీ అందరి అందమైన అభినందన సందేశాలకు ధన్యవాదాలు" అంటూ చిరంజీవి స్పందించారు. అంతేకాదు, తనకు యూకే పార్లమెంటులో జరిగిన సన్మానం తాలూకు ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు.



