Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్లు... 22 మంది నక్సల్స్ మృతి!

- ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
- బీజాపూర్, కాంకెర్ జిల్లాలో రెండు ఎన్కౌంటర్లలో 22 మంది మావోల హతం
- నక్సలైట్ల దాడిలో ఓ జవాను మృతి
- ఘటనాస్థలి నుంచి తుపాకులు, భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం
ఛత్తీస్గఢ్ బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. బీజాపూర్, కాంకెర్ జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 22 మంది నక్సల్స్ హతమయ్యారు. మావోల దాడిలో ఓ జవాను మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్లో గురువారం ఉదయం నుంచే కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోలు ఎదురుపడి కాల్పులు జరిపారు. దాంతో వారిపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.
ఘటనాస్థలి నుంచి 18 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు తుపాకులు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. అయితే, ఈ ఎదరుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఇదే సమయంలో కాంకెర్ జిల్లాలోనూ మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇక్కడ బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు సంయుక్తంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్లో నలుగురు మావోయిస్టులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం రెండు జిల్లాల్లోనూ యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.