Vishwaksen: విష్వక్సేన్ నివాసంలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

- విష్వక్సేన్ ఇంట్లో చోరీ ఘటన
- ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- రూ. 2.20 లక్షల విలువైన వస్తువులు అపహరణ
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు
- దొంగల నుండి సొత్తు రికవరీ
హీరో విష్వక్సేన్ నివాసంలో మూడు రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్-8లో ఉన్న విష్వక్సేన్ ఇంట్లో మార్చి 16న జరిగిన ఈ ఘటనపై ఆయన తండ్రి సి.రాజు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వరాజ్, కార్తీక్, సందీప్ అనే ముగ్గురు నిందితులను బుధవారం నాడు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
విష్వక్సేన్ ఇంట్లో మూడవ అంతస్తులో ఆయన సోదరి నివసిస్తున్నారు. మార్చి 16న తెల్లవారుజామున ఆమె మేల్కొని చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే ఆమె తన తండ్రికి సమాచారం అందించింది. ఈ చోరీలో రూ.2.20 లక్షల రూపాయల విలువైన రెండు బంగారు, డైమండ్ ఉంగరాలు పోయాయని సి.రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఒక వ్యక్తి తెల్లవారుజామున బైక్ పై వచ్చి నేరుగా మూడవ అంతస్తులోకి వెళ్లినట్లు గుర్తించారు. దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితులను పట్టుకుని, వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.