Sunita Williams: అంతరిక్షం నుండి తిరిగివస్తున్న సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ లేఖ

- అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడిపిన సునీతా విలియమ్స్
- ఎట్టకేలకు భూమికి తిరిగివస్తున్న వైనం
- భారత ప్రజల హృదయాలలో సునీతా విలియమ్స్ స్థానం ప్రత్యేకమన్న మోదీ
- ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు లేఖలో వెల్లడి
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సునీతా విలియమ్స్కు లేఖ రాశారు. మీరు భారతీయుల హృదయాల్లో నిలిచి ఉన్నారని పేర్కొన్నారు.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున గం.3.27 నిమిషాలకు వారు భూమి పైకి చేరుకుంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 'ఎక్స్' వేదికగా షేర్ చేశారు. మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ మా హృదయాలకు దగ్గరగానే ఉన్నారని పేర్కొన్నారు. భారత ప్రజలు మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఈ మిషన్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మీరు తిరిగి వచ్చిన తర్వాత భారత్ లో పర్యటిస్తారని ఆశిస్తున్నాం అని మోదీ లేఖలో తెలిపారు.