Nara Lokesh: పెద్ద ఎత్తున ప్రైవేటు, విదేశీ వర్సిటీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి: మంత్రి లోకేశ్

- అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న మంత్రి
- అమరావతిలో డీప్ టెక్, విశాఖలో ఏఐ వర్సిటీలు రాబోతున్నాయని వెల్లడి
- ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు చర్చలో ఈ విషయాలను వెల్లడించిన లోకేశ్
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. దేశంలో పేరెన్నికగన్న బిట్స్ ను అమరావతిలో ఏర్పాటుకు 70 ఎకరాలు కేటాయిస్తూ ఇటీవల కేబినెట్ ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టాటా గ్రూప్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాసు, యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ సవరణ బిల్లు-2025ను మంత్రి నారా లోకేశ్ శాసనసభలో ప్రవేశపెడుతూ... దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. వివిధ ఫారిన్ వర్సిటీల క్యాంపస్ లను రాష్ట్రానికి రప్పించాలన్నది సభ్యుల మనోగతంగా మంత్రి పేర్కొన్నారు. 2016లో ప్రైవేటు వర్సిటీల చట్టం తేవడం జరిగిందని, గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసిందన్నారు.
అవి యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్దంగా ఉన్నాయన్నారు. గ్రీన్ ఫీల్డ్ వర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్-100 గ్లోబల్ వర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉండాలని నిబంధన విధించారు. ఈ విషయంలో యూజీసీ నిబంధనలు వేరుగా ఉన్నాయని మంత్రి తెలిపారు. పూర్తిస్థాయిలో చర్చించి, ఆ చట్టాన్ని సవరించాల్సి ఉందన్నారు. విశాఖలో ఏఐ వర్సిటీ, అమరావతిలో స్పోర్ట్ వర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు.
ఈ నేపథ్యంలో పలు ప్రైవేటు వర్సిటీలు ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఏఎంఈ వర్సిటీ ఫిలిప్పీన్స్ ఆసక్తి కనబర్చాయని చెప్పారు. ఇతర వర్సిటీల ప్రతినిధులు కూడా చర్చలకు వస్తున్నారన్నారు. పెద్ద ఎత్తున ప్రైవేటు రంగంలో భారత్ లో టాప్ వర్సిటీలతో పాటు విదేశీ యూనివర్సిటీలను ఏపీకి తెచ్చేవిధంగా ప్రోత్సహిస్తామని మంత్రి లోకేశ్ అన్నారు.
కేవలం అమరావతి, విశాఖపట్నంకే కాకుండా అన్నిప్రాంతాలకు తెస్తామన్నారు. ఇన్సెంటివ్ లు అధికంగా ఇచ్చి రాయలసీమకు కూడా వర్సిటీలు రప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కనిగిరి ప్రాంతానికి ట్రిపుల్ ఐటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీని 2022లో ఎటువంటి శాంక్షన్ పోస్టులు లేకుండా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనివల్ల ప్రొఫెసర్లు, సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతానికి దాతలు కూడా ముందుకు వస్తున్నారన్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన మెకానిజం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ విద్యకు ప్రాధాన్యత నిస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రధానంగా ఉన్నత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. 2016లో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టాన్ని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో విశాఖపట్నానికి సెంచురియన్ వర్సిటీ మంజూరు చేసి, 75 ఎకరాలు, 4.75లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. 23 ప్రోగ్రామ్ లలో 133 మంది అధ్యాపకుల ద్వారా 2,550 మంది విద్యార్థులు అక్కడ శిక్షణ పొందుతున్నారని చెప్పారు.
దీనికి అనుబంధంగా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ఇంక్యుబేషన్ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన ట్రస్ట్ పరిధి ఒడిశాలో ఉండటంతో కొన్ని పాలనాపరమైన సమస్యలను వారు ఎదుర్కోవాల్సి వచ్చిందని, సకాలంలో నిధులు వారికి రాలేదని తెలిపారు. ఈ వర్సిటీ అభివృద్ధికి స్పాన్సరింగ్ బాడీగా ఏపీలో అనుమతి ఇవ్వాలని, ఇన్కం ట్యాక్స్ సీయూటీఎఫ్ ఏపీ కింద ఉంచాలని కోరారు. వర్సిటీలకు సంబంధించి సవరణ చేయాలంటే శాసనసభ, మండలికి మాత్రమే అధికారం ఉందన్నారు. అందుకే ఈ సవరణ బిల్లు ప్రతిపాదిస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
అంతకుముందుకు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రంలోకి ప్రైవేటు విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించే విషయమై పరిశీలించాలని కోరారు. బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ... రాష్ట్రం నుంచి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. దీనివల్ల రాష్ట్ర సంపద కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోందని తెలిపారు. కొన్ని వర్సిటీలు ఇక్కడ ఏర్పాటు చేసినా ఐటీ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ వేరే ప్రాంతాల్లో ఉండటం వల్ల ఆదాయం అక్కడకు వెళుతోందన్నారు.
ప్రైవేటు యూనివర్సిటీలు ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రానికి రప్పించేందుకు సబ్సిడీపై వారికి భూములు ఇవ్వాలని సూచించారు. మన రాష్ట్రంలో కూడా ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున జాతీయ, అంతర్జాతీయస్థాయి వర్సిటీలను ప్రోత్సహించాలని కోరారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ... కనిగిరిలో ట్రిపుల్ ఐటీ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తిరిగి ప్రారంభించాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.