TTD: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూన్ నెల కోటా విడుదల... డీటెయిల్స్ ఇవిగో!

- సుప్రభాతం, తోమాల సేవల టికెట్లు మార్చి 18న విడుదల
- మార్చి 21న కల్యాణోత్సవం టికెట్లు
- అంగప్రదక్షిణం టోకెన్లు మార్చి 22న విడుదల
- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మార్చి 24న విడుదల
- గదుల కోటా మార్చి 24న విడుదల చేయనున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూన్ నెలకు సంబంధించిన వివిధ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఈ మేరకు టికెట్ల విడుదలకు సంబంధించిన తేదీలను టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లను మార్చి 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ సేవల లక్కీ డిప్ కోసం మార్చి 18 నుండి మార్చి 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు మార్చి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్ల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. జూన్ 9 నుంచి 11 వరకు జరిగే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంచుతారు. వర్చువల్ సేవల దర్శన స్లాట్లను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మార్చి 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.