Revanth Reddy: మంత్రివర్గం నుండి మంత్రులను తొలగిస్తేనే పాలనపై పట్టు ఉన్నట్లా?: రేవంత్ రెడ్డి

Revanth Reddy launches Rajeev Yuva Vikasam

  • ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి
  • పథకాల అమలులో పారదర్శంగా వ్యవహరించాలని ఆదేశించామన్న ముఖ్యమంత్రి
  • ఎస్సీ వర్గీకరణ కోసం మూడున్నర దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోందని వెల్లడి

తనకు పరిపాలనపై పట్టు రాలేదని కొంతమంది అంటున్నారని, మంత్రివర్గం నుండి మంత్రులను తొలగిస్తేనే పట్టు ఉన్నట్లా? అధికారులను తొలగించి, బదిలీలు చేస్తేనే పాలనపై పట్టు సాధించినట్లు అవుతుందా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని తమ ఎమ్మెల్యేలకు, అసలైన అర్హులకు పథకాలు తప్పకుండా వర్తింపజేయాలని అధికారులకు చెబుతున్నామని తెలిపారు.

అసెంబ్లీ ఆవరణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 54 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. మొదటి ఏడాదిలో ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మరొకటి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలతో లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని అన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 65 లక్షల మంది మహిళలకు త్వరలో నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తామని అన్నారు.

స్వాతంత్ర్యం తర్వాత ఇప్పటి వరకు కులగణన జరగలేదని తెలిపారు. సమాజానికి ఎక్స్ రే వంటి కులగణన దేశమంతా జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడున్నర దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోందని తెలిపారు. తాము అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం భారీగా అవినీతి, దుబారాకు పాల్పడిందని అన్నారు. 

ఇక, ఒక్క ఇసుక విక్రయంలోనే రోజువారీ ఆదాయం రూ. 3 కోట్లు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లలో 17 శాతం పెరుగుదల నమోదైనట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News