DCHS: ఏపీలో 9 మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు డిసిహెచ్ఎస్‌లుగా ప‌దోన్న‌తి

9 government doctors promoted to DCHS in AP

  • అర్హులైన 85 మంది వైద్యులలో 50 మంది ప‌దోన్న‌తికి నిరాకరణ
  • పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలన్న మంత్రి సత్యకుమార్ 
  • పరిష్కార చర్యలను సమీక్షించాలని ఆదేశం

జిల్లా స్థాయిలో ఏర్పడిన జిల్లా ఆరోగ్యసేవల సమన్వయకర్తల (DCHS)పోస్టులకు శుక్రవారం చేపట్టిన భర్తీ ప్రక్రియలో తొమ్మిది మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు పదోన్నతి పొందారు. ప్ర‌స్తుతం 6 డిసిహెచ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉండ‌గా, త్వరలో మరో 2 ఖాళీలు ఏర్పడనున్నాయి.  వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ 9 మందికి డిసిహెచ్ లుగా పదోన్నతులను శుక్ర‌వారం ఆమోదించారు.
 
సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ (CSS) హోదాలో మూడేళ్ల పాటు సేవలందించి, పదవీ విరమణకు ముందు రెండేళ్ల స‌ర్వీస్ మిగిలి ఉన్న వైద్యులు DCHSగా పదోన్నతికి అర్హులవుతారు. అయితే పదోన్నతికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించిన వైద్య, ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్, పదోన్నతికి అర్హులైన 85 మంది అభ్యర్థులలో 50 మంది DCHSగా పదోన్నతికి నిరాకరించినట్లు గమనించారు. 

అర్హత కలిగిన వైద్యులలో 59 శాతం మంది పదోన్నతికి ఇష్టపడకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల చేపట్టిన పదోన్నతుల ప్రక్రియలో 33శాతం మంది అర్హత కలిగిన వైద్యులు ప్రొఫెసర్లుగా పదోన్నతికి నిరాకరించిన నేపథ్యంలో తాజాగా DCHSగా పదోన్నతికి నిరాకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
ప్రభుత్వ వైద్యులు పదోన్నతులను తిరస్కరించడానికి గల కారణాలు మరియు సాధ్యమయ్యే పరిష్కార చర్యలను క్షుణ్ణంగా సమీక్షించాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. 

DCHS
Andhra Pradesh
Satya Kumar Yadav
Govt Doctors
  • Loading...

More Telugu News