Balineni Srinivasa Reddy: జగన్ నాకు చేసిన అన్యాయం గురించి చెప్పాలంటే సమయం సరిపోదు: బాలినేని

- నేడు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ
- హాజరైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
- జగన్ పై విమర్శనాస్త్రాలు
- ప్రాణం ఉన్నంత వరకు పవన్ తోనే ఉంటానని ప్రతిజ్ఞ
జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ధ్వజమెత్తారు. జగన్... నువ్వు మీ నాన్నను అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రివి అయ్యావు... మా నాయకుడు పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగారు అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న వాళ్లనే అరెస్ట్ చేస్తున్నారని, స్కాములు చేసి కోట్లు సంపాదించిన వారిని అరెస్ట్ చేయలేదని బాలినేని విచారం వ్యక్తం చేశారు.
తాను వైసీపీ నుంచి బయటికి వస్తానా, లేదా అని చాలామంది సందేహించారని వెల్లడించారు. తనను జనసేనలోకి తీసుకువచ్చింది నాగబాబు అని తెలిపారు. ప్రాణం ఉన్నంతవరకు పవన్ కల్యాణ్ తోనే ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. పిఠాపురం సాక్షిగా తాను అన్నీ నిజాలే చెబుతానని అన్నారు.
"నాడు నా మంత్రి పదవిని జగన్ తీసేశారు... అందుకు నేనేమీ బాధపడలేదు. నా ఆస్తులను, నా వియ్యంకుడి ఆస్తులను జగన్ లాగేసుకున్నారు. చేసిన పాపాలు ఎక్కడీకి పోవు అని జగన్ తెలుసుకోవాలి. జగన్ నాకు చేసిన అన్యాయం గురించి చెప్పాలంటే ఈ సమయం సరిపోదు... మరోసారి చెబుతా" అని బాలినేని వివరించారు.
ఇక, పవన్ కల్యాణ్ తో ఓ సినిమా నిర్మించాలని ఉందని బాలినేని తన మనసులో మాట వెల్లడించారు.