Yediyurappa: పోక్సో కేసులో యడియూరప్పకు ఊరట

- 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే కేసు
- యడియూరప్పపై పోక్సో కేసు నమోదు
- ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలపై స్టే విధించిన కర్ణాటక హైకోర్టు
మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల బాలికపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదయింది. మార్చి 15వ తేదీన పోక్సో కేసు విచారణకు హాజరు కావాలంటూ ఆయనను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సమన్లను నిలిపివేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది.
కేసు వివరాల్లోకి వెళితే... ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి గత ఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై పోక్సో కేసును నమోదు చేశారు. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలను యడియూరప్ప కార్యాలయం ఖండించింది. గతంలో కూడా ఫిర్యాదుదారు పులువురిపై ఇలాంటి ఆరోపణలే చేశారని పేర్కొంది.