Vijayasai Reddy: సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. లోపలకు లాయర్లను కూడా అనుమతించని అధికారులు

- కాకినాడ పోర్టులో వాటాల బదిలీ కేసు
- విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి చేరుకున్న విజయసాయి
- కేసులో ఏ1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి
కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. విజయసాయి మినహా మరెవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు. ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను కూడా ఆపేశారు. వాటాల బదిలీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై విజయసాయిని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
కాకినాడ పోర్టు అధిపతి కేవీ రావును బెదరించి అక్రమంగా వాటాలను తీసుకున్నారనే అభియోగాలతో ఈ కేసు నమోదయింది. ఈ కేసులో ఏ1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఏ2గా విజయసాయిరెడ్డి, ఏ3గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఇదే కేసులో విజయసాయిని ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా ఈరోజు ఆయనను సీఐడీ విచారిస్తోంది. ఇటీవలే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నేటి సీఐడీ విచారణలో విజయసాయి ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.