Nara Lokesh: ఐదేళ్లలో ప్రపంచమంతా చూసేలా ఏపీలో మోడల్ ఎడ్యుకేషన్: నారా లోకేశ్

Nara Lokesh owes for AP model Education

  • ఆగస్టులో విశాఖపట్నంలో విద్యామంత్రుల కాంక్లేవ్ నిర్వహిస్తామన్న మంత్రి
  • యూనివర్సిటీ అడ్మినిస్టేషన్‌కు ఏకీకృత చట్టం తెస్తామని వెల్లడి
  • కాలేజి నుంచి బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలన్న మంత్రి
  • గత ప్రభుత్వ నిర్వాకంవల్ల విద్యా ప్రమాణాలు పడిపోయాయని వ్యాఖ్య
  • ప్రజాప్రతినిధుల చొరవతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన
  • శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్

అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో రాబోయే అయిదేళ్లలో ప్రపంచమంతా మనవైపు చూసేలా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్స్ పై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి లోకేశ్ విద్యారంగ సమస్యలు, పరిష్కారాలు, సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టమైన విద్యాశాఖను కోరుకున్నానని, కేజీ టు పీజీ ప్రక్షాళన చేయాలని భావించానని అన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 9నుంచి 3కు, క్విఎస్ టాప్ -100 ర్యాంకింగ్స్ లో ఏపీ వర్సిటీలు ఉండాలని సీఎం చెప్పారని తెలిపారు. విద్యామంత్రి అయ్యాక ఈ శాఖలో దారుణమైన పరిస్థితులను చూశానని, రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా 12 లక్షలమంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు సంబంధించి అనేక మాటలు చెప్పిందని, కానీ చేతల్లో అంతా డొల్లతనమేనని అన్నారు

జీవో 117పై ఇటీవల వర్క్ షాపు పెట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్ల 10మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 5507కు, 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 13,720కి పెరిగినట్లు చెప్పారు. సింగిల్ టీచర్ స్కూల్స్ 30 శాతం అంటే 12,512కు పెరిగాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డ్రాపవుట్ రేట్స్ ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 12.5 శాతానికి వెళ్లాయని, రాష్ట్రవ్యాప్తంగా 7 నుంచి 8వ తరగతికి 47 వేల మంది ఆడపిల్లలు విద్యకు దూరమైనట్లు చెప్పారు. తాను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని అధికారులను అడిగితే వారాలు, నెలల తర్వాత 33.40లక్షల మంది ఉన్నారని చెప్పారని గుర్తు చేసుకున్నారు. డ్రాప్ బాక్సు విధానం వల్ల సరైన సంఖ్య చెప్పలేదని, 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన దాదాపు లక్ష మంది పిల్లలు డ్రాప్ బాక్సులో ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా గ్రాస్ రోల్‌మెంట్ రేషియో ఎక్కువగా చూపేందుకు ఇలా చేశారని ఆరోపించారు.

నాస్ సర్వేలో బట్టబయలైన వైసీపీ ప్రభుత్వ నిర్వాకం

'నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (నాస్ ) సర్వే రిపోర్టు ప్రకారం 2017లో థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ లో ఎపి విద్యార్థులు దేశంలో నెం.1 స్థానంలో ఉండగా,  2021కి వచ్చేసరికి 27వస్థానానికి పడిపోయాం. టెన్త్ మ్యాథ్స్‌లో గతంలో ఒకటో స్థానంలో ఉండగా, గత ప్రభుత్వంలో 12వ స్థానానికి పడిపోయింది. సైన్స్ లో ఒకటో స్థానం నుంచి 15వ స్థానానికి, ఇంగ్లీషులో 4నుంచి 14వ స్థానానికి పడిపోయాం. ఫౌండేషన్ స్కిల్స్ పై అసర్ నివేదిక కూడా గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసర్ రిపోర్టు ప్రకారం 2018లో తెలుగుభాషకు సంబంధించి, గ్రేడ్-5 పిల్లలు గ్రేడ్ -2 చదవవడంపై పరీక్షించినపుడు 57 నుంచి 38 శాతానికి పడిపోయింది. గ్రేడ్-8 విద్యార్థులకు 2వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలు ఇచ్చి చదివించగా, 2018లో 78 శాతం మంది చదివితే, 2024లో 53 శాతానికి పడిపోయింది. 90 శాతం మంది 3వ తరగతి పిల్లలకు ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ లేవు.' అని వెల్లడించారు.

ముందస్తు వ్యూహం లేకుండా  సీబీఎస్ఈ పేరుతో హడావిడి

'మాజీముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ సీబీఎస్ఈ విషయంలో అనాలోచితంగా ప్రకటన చేశారు. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వెయ్యిపాఠశాలల్లో సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామినేషన్ విధానాన్ని బలవంతంగా రుద్దారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి మాక్ టెక్స్ట్ నిర్వహిస్తే 90 శాతం మంది విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. అది చూశాక ఉపాధ్యాయులను ప్రిపేర్ చేసి, తర్వాత అమలు చేద్దామని నిర్ణయించి, సీబీఎస్ఈ విధానాన్ని మూడేళ్లకు వాయిదా వేశాను. రెండోది టోఫెల్ పేరుతో రూ. 59 కోట్లు వృథా చేశారు. మూడోది ఐబి కరిక్యులమ్.

అది చాలా కష్టతరమైన విధానం. అద్భుతమైన ఉపాధ్యాయులు, ట్రైనింగ్ ఉంటేనే పెద్దపెద్ద పాఠశాలల్లో దానిని అమలుచేస్తారు. ఐబి ప్రాథమిక నివేదిక కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేశారు. గత అయిదేళ్లలో టీచర్లు ప్రాక్టికల్ సమస్యలు తెలియజెప్పేందుకు వెళితే విద్యాశాఖ కమిషనర్, సెక్రటరీ, మినిస్టర్ దొరికేవారు కాదు. ఉపాధ్యాయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి మద్యం షాపుల ముందు సెక్యూరిటీగా నిలబెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కుంటిసాకులతో  2022లో 1530మందిని ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా ట్రాన్స్ ఫర్ చేశారు. 45 అనవసరమైన యాప్‌లు పెట్టి, టీచర్లు విద్యాబోధనపై శ్రద్ధపెట్టలేని పరిస్థితికి తెచ్చారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులతో టాయ్ లెట్ ఫోటోలు తీయించారు.' అని ధ్వజమెత్తారు.

స్కూళ్లలో మౌలిక వసతులను గాలికొదిలేశారు

ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం 2018లో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నపుడు హామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ద్వారా స్కూల్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టు కింద నిధులు తెస్తే గత ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. నాడు-నేడు విషయంలో గొప్పలు చెబుతున్నారని, వాస్తవం ఏమిటంటే నాడు-నేడు ఫేజ్-1లో రూ. 880 కోట్ల పనులు, ఫేజ్-2 లో రూ.4 వేల కోట్ల పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. మరో విచిత్రమైన విషయమేమిటంటే ప్రభుత్వ స్కూళ్లలో రంగులు వేసిన హడావిడి చేసిన చోట జీవో 117 జిఓ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయన్నారు. సైంటిఫిక్ విధానం లేకుండా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. 2019-24 నడుమ కేంద్రప్రభుత్వం సమగ్ర శిక్ష కింద 900 కోట్లు సివిల్ వర్క్స్ కు కేటాయిస్తే రాష్ట్రం వాటా ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఆ నిధులు మురిగిపోయాయని మంత్రి అన్నారు.

గుడ్లు, చిక్కీలను వదలకుండా బొమ్మలు వేసుకున్నారు

'విద్యావ్యవస్థను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని నిర్ణయించాం. ఏ పార్టీ రంగులు ఉండకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో స్టూడెంట్ కిట్స్‌ను సైతం రాజకీయనాయకుల ఫోటోలతో నింపేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం బాటనీ పాఠ్య పుస్తకాలపై ముఖ్యమంత్రి, లక్ష్మీపార్వతి, ప్రిన్సిపల్ సెక్రటరీ, పుస్తకరచయితల సందేశాలతో 9 పేజీలు ముందుమాట ప్రచురించారు. వీటిని తొలగించడంతో ఈ ఏడాది రూ. 30లక్షల ఆదా అయ్యాయి. స్కూలు పిల్లలకు ఇచ్చే చిక్కీ, బెల్ట్‌లపై కూడా ఆయన ఫోటోలు వేసుకున్నారు. పిల్లలు రాసే వర్క్ బుక్ పై కూడా మాజీ సిఎం ఫోటో వేశారు. చివరకు డిక్షనరీని కూడా వదల్లేదు. పిల్లలకు పౌష్టికాహారంగా ఇచ్చే గుడ్డును కూడా వదలకుండా  స్టాంప్ వేసుకున్నారు. బ్యాగ్ పై కూడా ఆయన పేరు ఉంది. ఎంత అన్యాయం? గత ప్రభుత్వం విద్యావ్యవస్థను ప్రాపగాండ మిషన్ గా వాడుకుంది. గతంలో స్కూల్ యూనిఫాం వన్ సైడ్ ప్రింటింగ్ వల్ల నాసిరకంగా ఉండేవి. స్కూల్ కిట్స్ కు రాజకీయ నాయకుల పేర్లు ఉండకూడదని నిర్ణయించాం. అందుకే ఈ ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో కిట్స్ ఇస్తున్నాం.

రాబోయే అయిదేళ్లలో రూ.వెయ్యికోట్ల ఆదా చేస్తున్నాం

రాబోయే అయిదేళ్లలో స్టూడెంట్ కిట్లలో 305 కోట్లు ఆదా చేస్తున్నాం. మన ప్రభుత్వానికి ఫోటోల పిచ్చి లేదు. అందుకే చిక్కీపై ఏపీ ప్రభుత్వ లోగోవేశాం. టు సైడ్ ప్రింటింగ్ క్లాత్ ఇస్తున్నాం. సొంతబిడ్డల్లా శ్రద్ధ వహించి డిజైన్ చేశాం. ఫీల్డ్‌లో అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. వర్క్ బుక్స్‌లో కూడా మా ఫోటోలు లేవు. సానుకూల వాతావరణంలో పిల్లలు చదవాలని ఈ నిర్ణయాలు తీసుకున్నాం. బ్యాగులపై కూడా రాజకీయ  రంగులు లేవు. బ్యాగ్ నాణ్యంగా ఉండేలా చూసుకుంటున్నాం. రాబోయే అయిదేళ్లలో చిక్కీ సరఫరాలో రూ.240 కోట్లు, గుడ్ల రవాణాలో రూ.144 కోట్లు మొత్తంగా పాఠశాల విద్యలో రూ.వెయ్యి కోట్లు ఆదా చేయబోతున్నాం. గత ప్రభుత్వంలో ఏదేదో చేశామని గొప్పగొప్ప మాటలు చెప్పారు.  గుడ్ల సరఫరాకు సంబంధించి రూ.200కోట్లు, చిక్కీ సరఫరాదారులకు రూ.60 కోట్లు, ఆయాలు, నైట్ వాచ్‌మెన్ జీతాలకు రూ.62 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ రూ.22 కోట్లు కలిపి మొత్తం రూ.352 కోట్లు గత ప్రభుత్వం బకాయిపెట్టి వెళితే, కూటమి ప్రభుత్వం వచ్చాక తీర్చింది. గత ప్రభుత్వం ఐ ప్యాడ్స్ ఇస్తే పర్యవేక్షణ లేమి కారణంగా పిల్లలు అన్ సీన్ కంటెంట్స్ చూస్తున్నారని తల్లిదండ్రులు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో  కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నాం.

15 ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 2019-23 నడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 8.17 శాతం పిల్లలు తగ్గిపోగా, కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాదిలోనే 16.6 శాతం విద్యార్థులు పెరిగారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు మొదటి సంవత్సరం ఉత్తీర్ణత 42 శాతం ఉండగా, గత ప్రభుత్వ చేతగానితనం వల్ల 30 శాతానికి పడిపోయింది. రెండో సంవత్సరంలో గతంలో 58 శాతం ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో 39 శాతానికి తగ్గిపోయింది. ఈ ఏడాది చాలా కష్టపడ్డాం. మంచి ఫలితాలు వస్తాయని బలంగా నమ్ముతున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మిడ్ డే మీల్ కట్ చేశారు. అవగాహన లేకుండా హైస్కూలు ప్లస్ కార్యక్రమం పెట్టారు, అవసరమైన ల్యాబ్స్, అధ్యాపకులు లేకుండా 11, 12 తరగతుల పాఠాలు చెప్పాలన్నారు. దీంతో అకడమిక్ పర్బార్మెన్స్ తగ్గిపోయింది.

సొంత కార్యకర్తలను వీసీలుగా నియమించారు

హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 2014-19 నడుమ 9 ఎన్‌ఐఆర్ఎఫ్ వర్సిటీలు ఉండగా,  గత ప్రభుత్వంలో 5కి పడిపోయాయి. ఏఎన్‌యు, జేఎన్‌యు అనంతపురం, పద్మావతి వంటి యూనివర్సిటీలకు ఎటువంటి ర్యాంకులు లేవు. సొంత కార్యకర్తలను వైస్ చాన్సలర్లుగా నియమించారు. వైసీపీ కార్యకర్తగా పనిచేసిన ప్రసాదరెడ్డిని ఏయూ వీసీగా నియమించారు. ఆయన యూనివర్సిటీలో నాటి సీఎం పుట్టినరోజు నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టారు. ఎస్‌యూవీలో పెద్దిరెడ్డి బంధువు రాజారెడ్డిని వీసీగ నియమించారు. శ్రీకాంత్ రెడ్డికి పదేళ్ల నిబంధనలను ఉల్లంఘించి వీసీగా నియమించారు. ఆయన సజ్జలకు బంధువు. రాజకీయ సమావేశాలకు ఫ్లెక్సీలు పెట్టారు. రాజారెడ్డి బంధువు సుందరవల్లిని పద్మావతి వర్సిటీ వీసీగా నియమించారు. ఆర్‌జెయుకెటి చాన్సులర్‌గా గవర్నర్‌ను తొలగించి ముఖ్యమంత్రిని చాన్సులర్‌గా పెట్టారు. మొత్తం బంధువులతో వర్సిటీలను నింపేసి భ్రష్టు పట్టించారు.

భారీగా ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు 

కూటమి ప్రభుత్వం వచ్చేసరికి విద్యార్థులకు సంబంధించి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, పీజీ ఫీజు రీయింబర్సుమెంట్స్ కింద విద్యార్థులకు చెల్లించాల్సిన  రూ. 4,271 బకాయిలు పెట్టి వెళ్లారు. జిఓ 77 పేరుతో రీయింబర్సుమెంట్స్ తీసేశారు. దీంతో గ్రా‌స్ ఎన్రోల్‌మెంట్ రేషియో తగ్గడమేగాక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు పడిపోయాయి. ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు సంబంధించి జిఓ 42 తేవడంవల్ల 137 విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో ఎయిడెడ్ విద్యావ్యవస్థలో 1097 అధ్యాపకులు రోడ్డునపడ్డారు. ప్రైవేటు వర్సిటీలకు సంబంధించి సవరణ తెచ్చి జాయింట్ కొలబరేషన్ డిగ్రీ టాప్-100 ఉండాలని నిబంధన పెట్టారు.  ఈరోజు విట్, ఎస్ఆర్ఎం వంటి ప్రఖ్యాత సంస్థలు ఉత్తమ విద్యాబోధన చేస్తున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పేటెంట్ ఫైలింగ్స్ ఏపీలో కేవలం 1400 ఉంటే, తమిళనాడులో 7,600 ఉన్నాయి. పీహెచ్‌డీలకు వచ్చేసరికి ఎపిలో 5,600 మంది విద్యార్థులు ఉంటే, తమిళనాడులో 26 వేల మంది ఉన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉన్నత విద్యలో ఎలా దిగజారామో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

పాలిటెక్నిక్, ఐటిఐలను బలోపేతం చేస్తాం

స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి మన రాష్ట్రంలో పెద్దఎత్తున పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పాలిటెక్నిక్ లో అడ్మిషన్లు 69 శాతానికి అడ్మిషన్లు పడిపోయాయి. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి క్లస్టర్ మోడల్ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. లీప్ మోడల్ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) గైడ్ బుక్ తయారవుతోంది. ప్రభుత్వ పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, యూనివర్సిటీ విద్య, ఐటిఐ, పాలిటెక్నిక్‌లు విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫస్ట్ ఆప్షన్‌గా ఉండాలనే లక్ష్యంతో లీప్ మోడల్ తెస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో సీట్ల కోసం రికమెండేషన్ లెటర్స్ కావాలని వచ్చే పరిస్థితి తీసుకొస్తాం. వాల్యూబేస్ట్ గ్లోబల్లీ రిలవెంట్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తాం.

పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు

ఒక్కో ఇటుక పేర్చుకుని వెళ్తూ పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నాం. తొలుతగా క్లస్టర్స్ రీఆర్గనైజ్ చేశాం. జీవో 117కి ఆల్డర్నేటివ్ సిద్ధం చేస్తున్నాం. ఉపాధ్యాయుల సలహాల కోసం ప్రతివారం పాఠశాల విద్య కమిషనర్ టీచర్ల సంఘాలను కలుస్తున్నారు. ప్రజాదర్బార్‌లో అయిదున్నర గంటలు కూర్చుని ఉపాధ్యాయులతో చర్చించా. వారి సూచనలకు లోబడే 117కి ప్రత్యామ్నాయం తెస్తాం. కొత్త విధానంలో మోడల్ ప్రైమరీ స్కూలుకు కనీసం 60మంది విద్యార్థులు ఉండాలి. పాఠశాల విద్య బలోపేతానికి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు ట్రైనింగ్ ఇస్తాం. కేజీ టు పీజీ కరిక్యులమ్ ప్రక్షాళన చేస్తున్నాం. ఏపీ చరిత్రలో తొలిసారి హెచ్‌ఆర్‌డి విభాగానికి ఒకే సెక్రటరీని నియమించాం. ఉత్తమ విధానాలను పరిశీలించేందుకు అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపాం. మహారాష్ట్రలో పిల్లలకు పుస్తకాల బరువు తగ్గించే విధానం బాగుంది. ఈ ఏడాది నుంచి సెమిస్టర్ వారీగా పుస్తకాలు ప్రవేశపెట్టి, పిల్లలకు మోతబరువు తగ్గిస్తాం. మొదటి పేజిలో ఎవరి ఫోటోలు లేకుండా రాజ్యాంగ పీఠికను మాత్రమే ఉండేలా పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే ప్రకటించి, విద్యార్థులకు ఆహ్లాదం కలిగించే కార్యక్రమాలు చేపడతాం. వీటన్నింటికంటే ముఖ్యమైనది ఉపాధ్యాయులకు శిక్షణ. ప్రపంచంలో బెస్ట్ మోడల్ తీసుకుంటున్నాం. ఉత్తమ పద్ధతుల అధ్యయనానికి ఉపాధ్యాయులను  ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు పంపాలని నిర్ణయించాం. 

అమరావతిలో వరల్డ్ క్లాస్ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ సీనియారిటీ లిస్టు ఎవరి ప్రమేయం లేకుండా తయారు చేస్తున్నాం. లిస్టు ఫైనలైజ్ అయ్యాక టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ చేయబోతున్నాం. ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఈ చట్టాన్ని తెస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయులపై యాప్ ల భారం తగ్గించి సింగిల్ యాప్ తెస్తున్నాం. వచ్చే ఏడాదిలోగా అమరావతిలో వరల్డ్ క్లాస్ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తాం. పాఠశాల విద్యలో లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి సారించాం. గ్యారంటీడ్ ఫౌండేషన్, లెర్నింగ్, న్యూమరీస్ అమలు చేయబోతున్నాం. పాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్ లోకి తెస్తున్నాం. ప్రతి క్లాస్ రూమ్ యాక్టివ్ లెర్నింగ్ తేవాలని భావిస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధానం అమలుచేసి, వెనుకబడిన విద్యార్థులకు దానినిబట్టి హోమ్ వర్క్ ఇచ్చేవిధానం తెస్తాం. విద్యార్థుల పనితీరుకు సంబంధించి పూర్తి వివరాలతో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను ఇస్తున్నాం. జూన్, డిసెంబర్  నెలల్లో ప్రతిఏటా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తాం. విద్యార్థుల్లో ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ చాలా ముఖ్యం. విద్యార్థులకు అపార్ ఐడిని కేంద్రం మ్యాండేట్ చేస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు ఏం చదివారు, ఇతర వివరాలు అందులో ఉంటాయి.  నైతిక విలువలపై ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు  సలహాలతో పుస్తకాలను తయారు చేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు బాల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయించాం. అందులో ప్రాథమిక విధులు కూడా పొందుపరుస్తాం. పాఠశాలల్లో ఆత్మహత్యల నివారణకు సైకాలజీ కౌన్సిలర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. యాక్టివ్ ఏపీ పేరుతో స్కూల్ స్పోర్ట్స్‌ను ప్రోత్సాహిస్తాం. ఎన్‌సిసి, ఎన్‌ఎస్ఎస్‌ను వంటి వాటిని ప్రోత్సహించి విద్యార్థుల మానసిక వికాసానికి కృషి చేస్తాం.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించాం. చంద్రగిరి నియోజకవర్గంలో ఓ తల్లి పాదయాత్ర సమయంలో తమ గోడు వినిపిస్తూ, గంజాయికి బానిస చేసి తన కూతుర్ని శారీరకంగా వాడుకున్నారని చెప్పింది. ఆరోజు ఎస్పీ గంజాయి లేదన్నారు, అదే సమయంలో ఒక స్కూలులో గంజాయి దొరికింది. డ్రగ్స్ వద్దు పేరుతో క్యాంపెయిన్ సీరియస్ గా. పాఠశాలల్లో కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం.హోంమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ డ్రగ్స్ ఫుల్‌స్టాప్ పెట్టేందుకు చర్యలు చేపడుతోంది.  పాఠశాలల్లో సైన్స్ ఫేర్, కల్చరల్ ఫేర్, యాన్యువల్ డే నిర్వహిస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గ్రీన్ పాస్ పోస్టు విధానం అమలుచేస్తాం. అసెంబ్లీ స్పీకర్, అధికారులు అనుమతిస్తే అమరావతిలోనే స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడకు పిల్లలను రప్పించి, ప్రజాసమస్యలపై జరిగే చర్చల్లో అవగాహన కల్పించాలని భావిస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రిని కూడా రప్పించాలని అనుకుంటున్నాం. స్పెషల్ నీడ్స్ పిల్లలను ఆదుకునేందుకు కమిటీ వేస్తాం. ప్రతి మోడల్ ప్రైమరీ, హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుచేస్తాం. 

మౌలిక వసతులకు పెద్దపీట వేస్తాం

జీవో 117కి ప్రత్యామ్నాయం వచ్చాక స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. మౌలిక సదుపాయాలను బట్టి స్టార్ రేటింగ్ ఇస్తున్నాం. దీనివల్ల ఏ పాఠశాలలు ఏ రేటింగ్ ఉన్నాయి, ఏవి అభివృద్ధి చేయాలో తెలుస్తుంది.తన పర్యటనలో చిత్తూరు జిల్లాలో ఒక స్కూలుకు వెళితే పిల్లలు నేలపై కూర్చున్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని ఆ రోజే నిర్ణయించాను. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనలో గౌరవసభ్యులంతా భాగస్వాములు కావాలి. స్కూల్ మేనేజ్ కమిటీలు ఏర్పాటుచేశాం. పాఠశాలలకు అకడమిక్ ర్యాంకింగ్ కూడా ఇచ్చాం. దీనివల్ల పిల్లలు ఎక్కడ ఉన్నారో అవగాహన వస్తుంది.  రాబోయే 3నెలల్లో విద్యాశాఖ వివరాలతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తాం. పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ డిఇఓ పోస్టులు భర్తీ చేస్తాం. కొన్ని పాఠశాలల్లో టీచర్ల చొరవతో మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. విశాఖపట్నంలో ఆగస్టులో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాంక్లేవ్ నిర్వహించబోతున్నాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు సంబంధించి 15ఏళ్ల తర్వాత మొదటిసారి సంస్కరణలు తెస్తున్నాం. ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం. మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ కు ప్రాధాన్యతనిస్తున్నాం. పోటీపరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తాం. కెరీర్ గైడెన్స్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యతనిస్తాం. 

యూనివర్సిటీల వీసీలుగా విద్యావేత్తలు

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు విద్యావేత్తలను వీసీలుగా నియమించాం. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో పెద్దఎత్తున సంస్కరణలు తెస్తున్నాం. న్యాయపరమైన చిక్కులను తొలగించి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు భర్తీచేస్తాం. యూనివర్సిటీల అడ్మినిస్ట్రేషన్‌కు యూనిఫైడ్ యాక్ట్ తేవాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని 3 యూనివర్సిటీల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేసి, డీప్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇస్తాం. అమరావతిలో లా యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగువర్సిటీల ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై  కేబినెట్‌లో చర్చించి నిర్ణయిస్తాం. మండల నుంచి రాష్ట్రస్థాయి వరకు పబ్లిక్ లైబ్రరీలతోపాటు సెంట్రల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాం. స్వయం, స్వయం ప్లస్ ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ చేసి ఇండస్ట్రీ కనెక్ట్ విధానాలను అమలు చేస్తాం.  ప్రాంతాల వారీగా ఫోకస్ పాయింట్లను నిర్ణయించి ఆయా జిల్లాల్లో వచ్చే పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులకు కావాల్సిన శిక్షణనిస్తాం. ఇప్పటికే సుజలాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. పిల్లలు కాలేజిలనుంచి బయటకు వచ్చేసరికి ఉద్యోగం రావాలన్నదే మా లక్ష్యం.

ప్రపంచానికి అవసరమయ్యే నైపుణ్యాన్ని అందిస్తాం

ఓం క్యాప్ పేరు మార్చి ప్రపంచానికి కావాల్సిన నైపుణ్యాన్ని అందిస్తాం. భవన నిర్మాణ కార్మికులు, నర్సులకు జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ ఇచ్చి, ప్రపంచంలో ఎక్కడ అవకాశాలున్నా అందిపుచ్చుకునేలా స్కిల్ అప్ గ్రేడేషన్ చేస్తాం. ఐటిఐ, పాలిటెక్నిక్ లను ఎన్‌బీసీ ఎక్రిడిటేషన్‌తో అనుసంధానిస్తాం. పాలిటెక్నిక్, ఐటిఐ విద్యార్థులకు ఎసెస్‌మెంట్ ప్రధాన లోపంగా ఉంది. ఇందుకోసం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా ఎసెస్‌మెంట్ చేపట్టాం. సిఎంకు వివరించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. నైపుణ్య శిక్షణకు స్కిల్ హబ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. మంగళగిరిలో చేనేత కార్మికులు స్వర్ణకారులుగా కూడా ఉన్నారు. మంగళగిరిలో భారత్ లో బెస్ట్ జ్యుయలరీ పార్కును 75 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకు మంగళగిరిలో ఉన్న ఐటీఐలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడతాం.  స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఇప్పటినుంచే పునాదులు వేస్తాం. శివారు జిల్లాల్లోని పాఠశాలల్లో కన్నడ, ఒరియా, తమిళ భాషలను ప్రవేశపెడతాం. మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూనే ఇతర భాషలను ప్రోత్సహిస్తాం. పెండింగ్ ఫీజు రీయంబర్సుమెంట్స్ పద్ధతి ప్రకారం విడుదల చేస్తాం.ఆర్ట్ క్రాప్ట్, పిఇటిలపై సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆక్రమణలను తొలగిస్తాం. స్కిల్ డెవలప్ మెంట్, కెరీర్ కౌన్సిలింగ్ తప్ప ఇతరాలను అనుమతించం. మోడల్ ప్రైమరీ స్కూళ్లను బాధ్యతగా తీసుకుంటాం. అయిదేళ్లలో ప్రైవేటుకంటే అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.

నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటాం

ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్లు ఇచ్చే స్థాయికి తీసుకు వస్తాం. అయితే ఇది లోకేశ్ వల్లే సాధ్యం కాదు, అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ స్కూళ్లకు ఇచ్చే యాప్‌లో ఎమ్మెల్యేలకు ఒక పేజీ ఉంటుంది. రాబోయే అయిదేళ్లలో ప్రతి స్కూలుకు ఒక్కసారైన ఎమ్మెల్యే సందర్శించండి. మీరు చూశాక సూచనలిస్తే అమలుచేస్తాం. ఏకపక్ష నిర్ణయాలు మా వద్ద ఉండవు. 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు ఉండవచ్చు. సరిదిద్దుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తక్కువ స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాలలను మండలానికి ఒకటి దత్తత తీసుకొని అక్కడకు వెళ్లాలి. డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. తగ్గించేందుకు కలసికట్టుగా కృషి చేద్దాం. అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు. చాలా సమస్యలపై ఉమ్మడిగా చర్చిస్తున్నాం. కలసికట్టుగా పని చేస్తున్నాం. రాబోయే అయిదేళ్లలో ప్రపంచం మొత్తం  ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించి చర్చించేలా అంతా కలసి పని చేద్దాం' అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Nara Lokesh
Andhra Pradesh
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News