Nadendla Manohar: వాలంటీర్లను రాజకీయంగా వాడుకొని వదిలేసింది జగనే: నాదెండ్ల మనోహర్

- వైసీపీ దగా పోరాటాలు చేస్తోందని విమర్శ
- యువత, విద్యార్థులను మోసం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఆగ్రహం
- వాలంటీర్లను రాజకీయంగా వాడుకొని వదిలేసింది జగనేనని వ్యాఖ్య
- ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేస్తున్నామని వెల్లడి
వైసీపీ నాయకులకు పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా పారదర్శకత పాటించ లేదని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గత ఐదేళ్లు యువత, విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు యువత పోరు అంటూ కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ రోజు యువత, విద్యార్థులకు ఈ దుస్థితి తలెత్తిందని అన్నారు. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్నికల వాగ్ధానాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ, వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చేసి వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలను దగా చేశారని మండిపడ్డారు. యువత, విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు పోరాటం చేస్తామని మాట్లాడటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తమను మోసం చేసిందని యువత నమ్మినందువల్లే సార్వత్రిక ఎన్నికల్లో, మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారని అన్నారు. వైసీపీ వాళ్లవి దగా పోరాటాలని వ్యాఖ్యానించారు.
వాలంటీర్ల జీవో కూడా పొడిగించలేదు
44 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ అధినేత గొప్పలు చెప్పుకున్నారని, వాళ్లు ఇచ్చామని చెప్పుకొనే ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉన్నారని ఎద్దేవా చేశారు. వాళ్లకు గత ప్రభుత్వంలోనే గడువు ముగిసినా పొడిగించేందుకు ఎటువంటి జీవో జారీ చేయలేదని, జీవో ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లి జగన్ వాలంటీర్లను దగా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని నివేదికలు తెప్పించుకుని చూస్తే వాళ్ల గడువు తీరిందని తేలిందని వెల్లడించారు. జగన్ ఎన్నికలకు ముందు ఎప్పుడు మాట్లాడినా వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పాడు తప్ప, వాళ్ల అగ్రిమెంట్ రెన్యువల్ చేస్తామని మాత్రం చెప్పలేదని గుర్తు చేశారు. వాలంటీర్లను రాజకీయంగా వాడుకొని మోసం చేసింది జగనే అని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనలో ఏ వర్గాలైతే మోసానికి గురయ్యాయో వాళ్లందరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆవిర్భావ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు
పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా నిర్వహిస్తోన్న పార్టీ ఆవిర్భావ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ రోజు లాజిస్టిక్స్ కమిటీ, మెడికల్ కమిటీలతో సమావేశాలు నిర్వహించామని, పార్కింగ్ ప్రదేశాల్లోనూ, సభా ప్రాంగణంలో సెక్యూరిటీ ఏర్పాట్లుపై సమీక్షించామని అన్నారు. 14 అంబులెన్సులు, 7 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర చికిత్స సేవలు అందించడానికి స్థానిక అపోలో ఆసుప్రతి యాజమాన్యం ముందుకు వచ్చిందని తెలిపారు.
ఐదు పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేశామని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్దేశిత ప్రదేశాల్లో పార్కింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మన భాష, యాస, సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంచెలంచెలుగా జనసేన ఎదిగిన తీరు, దేశ రాజకీయాల్లో ఓ సరికొత్త చరిత్రను లిఖించిన ప్రయాణాన్ని దృశ్య రూపంలో చూపించబోతున్నామని ఆయన అన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ సభలో సామాన్యులకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు.
సామాజిక అంశాలపై విద్యార్థులు, రైతులు, మహిళలు, మత్స్యకార సోదరులు మాట్లాడతారన్నారు. ప్రతి ఒక్కరు సభ తిలకించేలా, ఎక్కడా తోపులాటలకు తావులేకుండా సభా ప్రాంగణం నుంచి హైవే వరకు ఎల్ఈడీ స్కీన్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
పేదలకు అధికారం పంచడమే జనసేన లక్ష్యం: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, ఆవిర్భావ సభకు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ రోజు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
సభ నిర్వహణ కోసం దాదాపు 14 కమిటీలను నియమించామని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.