Pranay: కోర్టు తీర్పు అనంతరం... ప్రణయ్ సమాధి వద్ద నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

- ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత, ప్రణయ్
- ప్రణయ్ ని చంపించిన అమృత తండ్రి మారుతిరావు
- నేడు అంతిమ తీర్పు వెలువరించిన నల్గొండ కోర్టు
2018 సెప్టెంబరు 14న ప్రణయ్ హత్య జరగ్గా... ఇన్నాళ్లకు ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. నల్గొండ జిల్లా రెండో అడిషనల్ సెషన్స్ జడ్జి రోజారమణి నేడు ముద్దాయిలకు శిక్షలు విధించారు. ఏ2 సుభాష్ శర్మకు మరణశిక్ష, మిగిలిన ముద్దాయిలకు జీవితఖైదు విధించారు.
ఈ కేసులో తీర్పు వెలువడిన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. తల్లిదండ్రులు, సోదరుడు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతం అవుతూ అతడి సమాధిని ముద్దాడారు. ప్రణయ్ సమాధికి పూలమాల వేసి, గులాబీ పూలతో అలంకరించారు.