SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద మరో రెండు మృతదేహాల గుర్తింపు

- ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం
- 8 మంది గల్లంతు
- నేటికి 17 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
- నిన్న ఒక మృతదేహం వెలికితీత
- అదే ప్రాంతంలో మరో రెండు మృతదేహాలు
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి 17 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
నిన్న తొలి మృతదేహాన్ని వెలికి తీసిన రెస్క్యూ టీమ్, నేడు మరో రెండు మృతదేహాలను గుర్తించింది. తొలి మృతదేహాన్ని టన్నెల్ బోరింగ్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది గా గుర్తించారు. అతడి మృతదేహం లభించిన చోటే, మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. ఈ రెండు మృతదేహాలను నేడు వెలికితీయనున్నారు.
కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తీసుకువచ్చిన తర్వాత సహాయకచర్యల్లో పురోగతి కనిపించింది. కేరళ పోలీస్ విభాగానికి చెందిన ఈ జాగిలాలు... మట్టిలో 15 అడుగుల కింద ఉన్న మృతదేహాల ఆనవాళ్లను కూడా పసిగట్టగలవు.