Jagdeep Dhankar: ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఉప రాష్ట్రపతి... పరామర్శించిన ప్రధాని మోదీ

- ఢిల్లీ ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్లో ధంకర్ కు చికిత్స
- ఉప రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం
- త్వరగా కోలుకోవాలంటూ మోదీ స్పందన
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ నేడు ఢిల్లీ ఎయిమ్స్ ను సందర్శించారు. చికిత్స పొందుతున్న జగదీప్ ధంకర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఉప రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు.
కాగా, 73 ఏళ్ల జగదీప్ ధంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఎయిమ్స్ కార్టియాలజీ విభాగం ఆయనకు క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తోంది.