Gujaratis: వ్యాపారంలో గుజరాతీల సక్సెస్ వెనుక అసలు కారణాలివే!

- 191 మంది భారత బిలియనీర్లలో 108 మంది గుజరాతీయులే
- అమెరికాలో సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదన
- దేశ జీడీపీకి 8%, పారిశ్రామిక ఉత్పత్తికి 18% గుజరాత్ వాటా
- మొత్తం ఎగుమతుల్లో 25% గుజరాత్ నుంచే!
- తరతరాలుగా వ్యాపారానికే గుజరాతీయుల ప్రాధాన్యత
గుజరాతీయులు వ్యాపార, ఆర్థిక రంగాలలో ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ, వారి విజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది. గుజరాతీల ఆర్థిక శక్తిని తెలియజేస్తూ, వారి సంపద సృష్టి సామర్థ్యాన్ని వివరించారు.
భారతదేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీయులేనని చోక్సీ పేర్కొన్నారు. అంతేకాకుండా, అమెరికాలో నివసిస్తున్న గుజరాతీలు సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఆయన వెల్లడించారు. దేశ జనాభాలో గుజరాతీయులు 5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో 8 శాతం కంటే ఎక్కువ, పారిశ్రామిక ఉత్పత్తిలో 18 శాతం వాటా కలిగి ఉన్నారు. దేశ భూభాగంలో 6 శాతం మాత్రమే ఉన్న గుజరాత్, మొత్తం ఎగుమతుల్లో 25 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం.
గుజరాతీల విజయానికి కారణాలు
గుజరాతీయులు వ్యాపారంలో రాణించడానికి గల కారణాలను చోక్సీ విశ్లేషించారు. తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక ఆలోచనలు, కొత్త మార్కెట్లను స్వీకరించే సామర్థ్యం వారి విజయానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఉద్యోగం కంటే వ్యాపారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వారి ప్రత్యేకత. 'ఉద్యోగాలు పేదల కోసం' అనే భావన గుజరాతీ కుటుంబాలలో సాధారణంగా వినిపిస్తుంది. పిల్లలు చిన్నప్పటి నుంచే కుటుంబ వ్యాపారాల్లో డబ్బు నిర్వహణ, ఒప్పందాలు, నష్టాల అంచనా వంటి విషయాలను నేర్చుకుంటారు.
రిస్క్ తీసుకోవడం గుజరాతీల మరో ముఖ్య లక్షణం. వజ్రాల వ్యాపారం నుంచి స్టాక్ మార్కెట్ల వరకు, అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. చిన్న వయస్సు నుంచే కుటుంబ వ్యాపారాలలో సహాయం చేయడం ద్వారా వాస్తవిక ఆర్థిక విషయాలను నేర్చుకుంటారు. గుజరాతీలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ సమాచారం పంచుకుంటారు.
వివిధ రంగాల్లో గుజరాతీల ఆధిపత్యం
చోక్సీ వివిధ పరిశ్రమల్లో గుజరాతీయులు ఏ విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారో వివరించారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలు సూరత్లో ప్రాసెస్ చేయబడతాయని, బెల్జియం, ఇజ్రాయెల్లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన తెలియజేశారు. భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60 శాతం కంటే ఎక్కువ మంది గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారని ఆయన అన్నారు. అమెరికాలోని హోటళ్లలో 60 శాతం పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవారని ఆయన వెల్లడించారు.
గుజరాతీలు నష్టాలను పాఠాలుగా స్వీకరించి మరింత బలంగా పుంజుకుంటారు. డబ్బు సంపాదనతో పాటు, పొదుపుగా ఉండటం, లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా సంపదను పెంచుతారు. సాంప్రదాయ వ్యాపారాల నుండి ఆధునిక టెక్ స్టార్టప్ల వరకు, గుజరాతీలు ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ఆయన వివరించారు.