Yuvatha Poru: 'యువత పోరు' పోస్టర్ ఆవిష్కరించిన వైవీ సుబ్బారెడ్డి

- కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందన్న వైసీపీ నేతలు
- ఈ నెల 12న 'యువత పోరు' పేరిట ధర్నా కార్యక్రమం
- కూటమి మోసాలను ఎండగడతామన్న వైవీ సుబ్బారెడ్డి
ఎన్నికల హామీలను అమలు చేయకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతిపై చంద్రబాబు సర్కారు మాట తప్పిందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పోరాడేందుకు 'యువత పోరు' పేరిట కార్యాచరణ రూపొందించారు. 'యువత పోరు' పోస్టర్ ను వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నేడు ఆవిష్కరించారు.
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... మార్చి 12న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట 'యువత పోరు'లో భాగంగా ధర్నాలు చేపడతామని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తామని తెలిపారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. జగన్ 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చారని, అప్పట్లోనే 5 కాలేజీలు ప్రారంభించారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ మోసాలను బయటపెడుతూ 'యువత పోరు'ను విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కూడా పాల్గొన్నారు.